- ఐపీఓల సక్సెస్తో ఇష్టపడుతున్న ఉద్యోగులు
వెలుగు బిజినెస్ డెస్క్: జొమాటో, పేటీఎం, డెలివరీ వంటి కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లు సక్సెస్ కావడంతోపాటు, ఈసాప్స్ కింద ఇచ్చిన షేర్లను నిలకడగా కంపెనీలే తిరిగి కొనుగోలు చేస్తుండటంతో ఉద్యోగులకు ఈసాప్స్పై క్రేజ్ పెరుగుతోంది. ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలలో ఉద్యోగులకు ఈసాప్స్ కాసుల వర్షమే కురిపించాయి. కానీ, స్టార్టప్ కంపెనీలలో ఈసాప్స్ తీసుకోవడానికి ఉద్యోగులకు తగినంత విశ్వాసం పబ్లిక్ ఇష్యూల వల్లే పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2021 నుంచి ఉద్యోగుల నుంచి ఈసాప్స్ షేర్లను కొనుగోలు చేయడానికి కంపెనీలు మొత్తం 1.46 బిలియన్ డాలర్లను వెచ్చించాయని క్యాపిటా డేటా వెల్లడిస్తోంది.స్టార్టప్లలో జాయినయ్యే ఉద్యోగులకు అత్యధికంగా బెనిఫిట్ తెచ్చిపెట్టేవి ఈసాప్స్మాత్రమే. ఇండస్ట్రీలోని ఇతర కంపెనీలకు సమానమైన జీతం ఎలాగూ దొరుకుతుంది. కానీ, స్టార్టప్ సక్సెసయితే ఈసాప్స్ కారణంగా లభించే సంపద అపారమైనదని యూనికార్న్ కంపెనీ రేజర్పే ఫౌండర్, సీఈఓ హర్షిల్ మాధుర్ చెప్పారు.
మా కంపెనీలో కొంత మంది ఉద్యోగుల జీవితాలైతే ఈసాప్స్తో పూర్తిగా మారిపోవడాన్ని చూశానని పేర్కొన్నారు. పదేళ్ల కాలానికి చూసినా ఒక్క జీతం పెరుగుదలతో వారు ఇంత సంపద ఎప్పటికీ సంపాదించి ఉండలేకపోయేవారని హర్షిల్ మాధుర్ వెల్లడించారు. గత పదేళ్లలో రేజర్పే నాలుగుసార్లు ఈసాప్ షేర్లను బైబ్యాక్ చేసింది. కిందటేడాది 75 మిలియన్ డాలర్లతో ఉద్యోగుల నుంచి ఈసాప్ షేర్లను ఈ కంపెనీ కొనుక్కుంది. ఫండింగ్ కోసం ప్రయత్నించే ప్రతీసారీ కొత్త ఇన్వెస్టర్లకు ఉద్యోగుల చేతిలోని షేర్లను సెకండరీ సేల్ కింద ఆఫర్ చేస్తున్నామని రేజర్పే సీఈఓ వివరించారు. 2021–22 లో టెక్ స్టార్టప్లకు పెట్టుబడులు వెల్లువెత్తినప్పటి నుంచీ ఉద్యోగులు కూడా తక్కువ జీతం, ఎక్కువ ఈసాప్స్ కోసం చర్చలు జరపడం మొదలైంది. ఇటీవల స్టార్టప్లకు నిధులు దొరకడమే కష్టంగా మారింది. దీంతో ఇప్పుడు ఈసాప్స్ మీద ఉద్యోగులు అంత మోజుపడటం లేదు. కానీ, స్టార్టప్స్ దగ్గర తగినంతగా డబ్బులు ఆడని నేపథ్యంలో ఆ కంపెనీలు ఈసాప్స్ఎక్కువగా ఇస్తున్నాయి.
యూఎస్, సింగపూర్ల .. తరహా పన్ను విధానం ఉండాలి..
ఉద్యోగులకు ఈసాప్స్ కింద ఇచ్చే షేర్లు ఒకేసారిగా రావు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఒప్పుకున్న దాని ప్రకారం ఏటా కొన్ని చొప్పున జారీ చేస్తారు. ఈసాప్స్పై అమలవుతున్న పన్ను విధానాలు మాత్రం మన దేశంలో కొంత నిరుత్సాహం కలిగించేవేనని ఇండస్ట్రీ ఎనలిస్టులు చెబుతున్నారు. సింగపూర్, యూఎస్ వంటి దేశాల తరహా పద్ధతులు ఇండియాలోనూ వస్తే మేలని పేర్కొంటున్నారు.
ఉద్యోగులకు లిక్విడిటీ ఎప్పుడొస్తుంది....
స్టార్టప్ కంపెనీ ఒక స్కేల్కి ఎదిగి, ఫండింగ్ను తెచ్చుకోగలిగినప్పుడే ఈసాప్ షేర్లకు లిక్విడిటీ దొరుకుతుంది. ఫండింగ్ బూమ్ టైములో ఏ, బీ సిరీస్ రౌండ్ల ఫండింగ్మాత్రమే పూర్తి చేసుకున్న స్టార్టప్ కంపెనీలు సైతం ఒకటి, రెండేళ్లలోనే ఈసాప్క్యాష్ అవుట్స్ను ఆఫర్ చేయడం విశేషం. సిరీస్ ఏ కింద 3 మిలియన్ డాలర్ల ఫండింగ్ తెచ్చుకున్న ఫిన్టెక్ కంపెనీ గ్రిప్ఇన్వెస్ట్2022 మొదట్లోనే బైబ్యాక్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఇలాంటి అవకాశాలు మళ్లీ ఇప్పట్లో రాకపోవచ్చని ఒక వెంచర్ క్యాపిటల్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ చెప్పారు.
కనీసం రెండు, మూడేళ్ల వాల్యూ క్రియేషన్ తర్వాత మాత్రం ఈసాప్స్ బైబ్యాక్ అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. కాకపోతే, పైన చెప్పిన ఉదాహరణ వల్ల చిన్న కంపెనీలలో సైతం ఈసాప్స్ తీసుకోవడానికి ఉద్యోగులు ఇష్టపడుతున్నారు. యూనికార్న్గా మారిన ఫోన్పేను విడదీసినప్పుడు ఫ్లిప్కార్ట్ తన ఉద్యోగుల కోసం 700 మిలియన్ డాలర్లతో ఈసాప్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఫోన్పే విలువను నగదు రూపంలో ఫ్లిప్కార్ట్ ఉద్యోగులకు చెల్లించారు.