తెలంగాణ ప్రజలు నిన్ను థూ అని అసహ్యించుకుంటున్నరు

తెలంగాణ ప్రజలు నిన్ను థూ అని అసహ్యించుకుంటున్నరు

మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్. కన్నెర్ర చేస్తే.. మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. హరీష్ తన పరువు కాపాడుకుంటరా లేదా ఆలోచించుకోవాలన్నారు. తనకు మద్దతు ఇస్తున్నవాళ్లను హరీష్ బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్‌‌లో నిర్వహించిన గౌడ గర్జన సభలో ఈటలతో పాటు కేంద్ర మంత్రి మురళీధరన్, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను ఆచరించే మూర్ఖుడు హరీశ్ అని విమర్శించారు. మిస్టర్ హరీశ్ రావు పిచ్చివేషాలు బంద్ చేయకపోతే నీ భరతం పట్టడం ఖాయమంటూ హెచ్చరించారు. వాళ్ల నియోజకవర్గాల్లో ఏమీ చేయని కొందరు దద్దమ్మ ఎమ్మెల్యేలు.. తన నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 

నీ పరువు కాపాడుకో..

ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే.. తెలంగాణ జాతి పులకించేపోయేదని, ఇప్పుడు ఆయన మాట్లాడితే టీవీలు బంద్ చేస్తున్నారని ఈటల అన్నారు. తన వెంట వచ్చే కార్యకర్తలపై పోలీసులను ప్రయోగించడం, హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు డబ్బు సంచులు తేవడం ఆపేసి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని కేసీఆర్‌‌కు హితవు చెప్పారు. ఇక్కడ అడ్డాపెట్టి తన వెంట వచ్చే కార్యకర్తలు, నాయకులను మంత్రి హరీశ్‌రావు అనేక ఇబ్బందులు పెడుతున్నారని, మహిళా సర్పంచులపై సైతం దాడికి దిగుతున్నారని ఆరోపించారు. ‘‘రాత్రి పూట దొంగలాగా.. మా నాయకుల ఇళ్లకు పోలీసుల వాహనాల అండతో హరీశ్ వస్తున్నాడు. అర్ధరాత్రి వాళ్ల ఇంటికి వచ్చి టీఆర్ఎస్‌లోకి రావాలని ఒత్తిడి చేసే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా” అంటూ ధ్వజమెత్తారు. ఆయన తీరుకు విసిగిపోయి యావత్ తెలంగాణ ప్రజలు థూ అని అసహ్యించుకుంటున్నారని ఈటల చెప్పారు. ఈ పద్ధతి మార్చుకుని నీ పరువు కాపాడుకుంటావో లేదో ఆలోచించుకోవాలని హరీశ్‌రావుకు ఈటల సూచించారు.