నాడు..నేడు..రాష్ట్ర ప్రయోజనాలకే V6 వెలుగు పెద్దపీట

నాడు..నేడు..రాష్ట్ర ప్రయోజనాలకే V6 వెలుగు పెద్దపీట

బీఆర్​ఎస్​  సర్కారు స్థానంలో కాంగ్రెస్​  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కృష్ణా జలాలపై  పోరాటాన్ని ‘వీ6 వెలుగు’ ఆపలేదు. శ్రీశైలం డెడ్​ స్టోరేజీ నుంచి దొడ్డిదారిలో నీళ్లు మళ్లించుకుపోయేలా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ (సంగమేశ్వర) పనులు శరవేగంగా నడుస్తున్నాయని పేర్కొంటూ ‘ఆగని రాయలసీమ లిఫ్ట్​!’ పేరుతో గతేడాది అక్టోబర్​30న ‘వెలుగు’ ప్రముఖంగా ప్రచురించింది. ఏపీలో అప్పటి జగన్​ సర్కారు ఎలాంటి అనుమతుల్లేకుండా  ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నా నాటి బీఆర్​ఎస్​ సర్కారు కళ్లు మూసుకుందని, తీరా కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రాయలసీమ లిఫ్ట్​ను అడ్డుకునేందుకు ఎందుకు దృష్టి పెట్టడంలేదని నిలదీసింది. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాసింది. దీంతో 

మార్చి 15న పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్​ ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపి, ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తేవాలని ఏపీని ఎక్స్​పర్ట్ అప్రైజల్​ కమిటీ(ఈఏసీ) ఆదేశించింది.  కాగా, ఈఏసీ ఆదేశాలను ఏపీ బేఖాతర్ చేస్తోందని, రీస్టోరేషన్​ పనులు చేపట్టకుండా చోద్యం చూస్తోందని జూన్​2న ‘రాయలసీమ లిఫ్ట్​పై ఏపీ డోంట్​ కేర్​’ పేరుతో మరో కథనాన్ని వెలుగు పబ్లిష్​ చేసింది. దీంతో ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ లేఖ రాసింది. వెంటనే రీస్టోరేషన్​ పనులు చేపట్టేలా ఏపీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.

 దీనికితోడు ఏపీ గుట్టుగా శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్ లైనింగ్​ పనులు తిరిగి ప్రారంభించిందని,  దీని కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుంచి 90 వేల క్యూసెక్కులకు పెంచుతోందని, పూర్తయితే రోజూ 8 టీఎంసీలను తన్నుకుపోయే ప్రమాదముందని హెచ్చరిస్తూ ఏప్రిల్​ 11న ‘శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం!’ పేరుతో ‘వెలుగు’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో  ఎస్​ఆర్​ఎంసీ లైనింగ్​ పనులను ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు లెటర్​ రాసింది.  కాగా, ఏపీ ప్రభుత్వ రెండు నాల్కల తీరును ఎండగడ్తూ ‘ముందు నీతులు.. వెనుక గోతులు!’ పేరుతో ఈ నెల 3న  ‘వెలుగు’ ప్రత్యేక కథనం ప్రచురించింది. తెలంగాణ నీటి హక్కులపై ఏపీ ఎలా కుట్రలు చేస్తోందో, సహకరించుకుందామంటూనే మన ప్రాజెక్టులను ఎలా అడ్డుకుంటుందో సాక్ష్యాధారాలతో సహా వివరించింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్​లో వాదించడాన్ని, పాలమూరు, డిండి, సీతారామ, కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడాన్ని, సాగర్​ ప్రాజెక్టును మనకు అప్పగించకుండా ఏపీ మోకాలడ్డుతున్న తీరును తూర్పారబట్టింది. పోలవరం బ్యాక్​ వాటర్​ ముంపుపై మన వాదన నిజం కాదంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడడమే కాకుండా, ఆ అంశం ప్రగతి మీటింగ్​లో చర్చకు రాకుండా ఏపీ ఎలా కుట్రలు పన్నుతుందో సోదాహరణంగావివరించింది.