- మోసాలు పెరగడానికి అదే కారణమవుతోంది
- ఎనలిటిక్స్ను బ్యాంకులు ఎక్కువగా వాడాలి
- డెలాయిట్ సర్వే రిపోర్టు
న్యూఢిల్లీ: కొవిడ్–19తో డిజిటల్ ట్రాన్సాక్షన్లు భారీగా పెరగడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లను మోసం చేసేవాళ్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని డెలాయిట్ ఇండియా ఒక రిపోర్టులో వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో ఏ కారణాల వల్ల మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందో కూడా ఈ రిపోర్టులో తెలిపింది. ఉద్యోగులలో చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తుండటం, నాన్–బ్రాంచ్ బ్యాంకింగ్ ఛానల్స్ వాడటం, ఫోరెన్సిక్ ఎనలిటిక్స్ టూల్స్ను తగినంతగా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు వాడకపోవడం వల్ల మోసాలు ఎక్కువయ్యే సూచనలున్నాయని డెలాయిట్ టచ్ తొమాట్సు ఇండియా ఈ రిపోర్టులో విశ్లేషించింది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఆడిట్– ఫైనాన్స్, ఎసెట్ రికవరీ విభాగాలలోని 70 మంది సీనియర్ ఆఫీసర్లతో చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయినట్లు పేర్కొంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల సీనియర్ ఆఫీసర్లు తమ సర్వేలో పాల్గొన్నట్లు వివరించింది. రాబోయే రెండేళ్లలో మోసాలు మరింత పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది.
మోసాలు ఎక్కువగా రిటెయిల్ బ్యాంకింగ్లోనే చోటు చేసుకుంటాయని 53 శాతం మంది సర్వేలో చెప్పారని, గత రెండేళ్లలో ఇలాంటి మోసాలు వంద శాతం పెరగడాన్ని తాము చూసినట్లు పేర్కొన్నారని డెలాయిట్ రిపోర్టు వెల్లడించింది. అంతకు మునుపు తమ రిపోర్టుతో పోలిస్తే మోసాలు 29 శాతం పెరిగాయని వివరించింది. నాన్–రిటెయిల్ సెగ్మెంట్లో మోసాలు సగటున 20 శాతం పెరిగాయని 56 శాతం మంది సీనియర్ ఆఫీసర్లు చెప్పినట్లు తెలిపింది. డేటా థెఫ్ట్, సైబర్ క్రైమ్, థర్డ్పార్టీ ఇండ్యూస్డ్ ఫ్రాడ్, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంటేషన్...తమకు ఎదురవుతున్న ప్రధానమైన సవాళ్లని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది వెల్లడించారు. కొవిడ్–19 వల్ల తమ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్ఎం) విభాగాలలో ఎనలిటిక్స్ వాడకం పెరిగిందని, మోసాలు కనుక్కోవడానికి వాటిపైనే ఆధారపడుతున్నామని బ్యాంకులు, ఫైనాన్షియల్ఇన్స్టిట్యూషన్ల సీనియర్ ఆఫీసర్లు చెబుతున్నట్లు డెలాయిట్ సర్వే పేర్కొంది. కస్టమర్లు, ఉద్యోగులలో మోసాలపై అవగాహన పెంచాల్సి వస్తోందని, టార్గెట్ ఆపరేటింగ్ మోడల్లో మార్పులు చేసుకోవాల్సి వస్తోందని కూడా ఆ సీనియర్ ఆఫీసర్లు పేర్కొన్నట్లు వివరించింది. కరోనా వైరస్వల్ల దేశంలోను, గ్లోబల్గానూ ఆపరేషన్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని డెలాయిట్ పార్ట్నర్ కే వీ కార్తిక్ చెప్పారు. డిజిటల్ చానల్స్ వాడకం వల్ల ఒకవైపు ట్రాన్సాక్షన్ల వేగం పెరిగిందని, కానీ, మరోవైపు టెక్నాలజీ వినియోగంతో బిజినెస్ మోడల్స్లో కాంప్లెక్సిటీ కూడా అధికమైందని పేర్కొన్నారు. ఫ్రాడ్ రిస్క్ ఎసెస్మెంట్లను ఏడాదికోసారి చేపడుతున్నామని, రిజిస్టర్లో అప్డేట్ చేస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది చెప్పారు.