
- వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అమలులోకి..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్కూళ్లలో విధులకు డుమ్మా కొట్టే వారితో పాటు ఆలస్యంగా వచ్చే టీచర్లకు చెక్పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ను అమల్లోకి తీసుకువస్తోంది. సర్కార్బడుల్లో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ పద్ధతి అమలు చేసేందుకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ పూర్తి స్థాయిలో అమలు కానుంది.
పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ..
జిల్లాలో డీఈఓ, ఎంఈఓ ఆఫీలతో పాటు 756 ప్రాథమిక పాఠశాలలు, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు, 110 హైస్కూళ్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4వే ల మందికి పైగా టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు. పట్టణ ప్రాంతంతో పాటు ఏజెన్సీలోని మారు మూల ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు చాలా మంది ప్రేయర్ అయిపోయి క్లాసులు స్టార్ట్ అయినా రాని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో అయితే ఇద్దరు టీచర్లుంటే ఒక టీచర్ వారం రోజులు మరో టీచర్ వారం రోజులుగా వంతుల వారీగా అటెండ్ అవుతున్న దాఖలాలున్నాయి. ఇదే విషయంలో ఉమ్మడి గుండాల మండలంలో కొందరికి గతంలో మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసిన ఘటనలున్నాయి. కొందరు టీచర్లు మధ్యాహ్నం టైంలోనే ఇండ్లకు వెళ్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ను తీసుకువచ్చింది. గవర్నమెంట్ స్కూళ్లలో ఇప్పటికే స్టూడెంట్స్కు ప్రత్యేక యాప్ ద్వారా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. టీచర్స్కు కూడా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ ను తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
నాణ్యమైన విద్య అందించేందుకే..
ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ను జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నాం. మొదటి వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత పూర్తి స్థాయిలో ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రత్యేక యాప్ ద్వారా టీచర్లతో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది కూడా అటెండెన్స్ను వేయాల్సి ఉంటుంది.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా ఇప్పటికే ఈ విధానంపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ యాప్ ద్వారా టీచర్లు పాఠశాలకు అనుమతి లేకుండా గైర్హాజరయ్యే అవకాశం లేదు. ఆలస్యంగా రావడం, సమయాని కంటే ముందుగానే వెళ్లడం లాంటివి నిరోధించవచ్చు. తద్వారా స్టూడెంట్స్కు న్యాయమైన విద్యను అందించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది.
వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రికొత్తగూడెం