
- అభ్యర్థుల పేర్లు.. నియోజకవర్గాల సంఖ్య మార్చి రిపోర్టు
- ఎవరు పోటీ చేస్తున్నారో తెలియకుండానే ఫలితాలు
- ఎక్కువ సీట్లు వచ్చిన సర్వే రిపోర్టులో పార్టీ పేరు మార్ఫింగ్
- లగడపాటి రాజగోపాల్పేరిట బయటకు నకిలీ సర్వే
హైదరాబాద్, వెలుగు : గత రెండు రోజుల నుంచి కొన్ని ఫేక్ సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. అభ్యర్థుల వివరాలు, అసెంబ్లీ స్థానాలతో నిమిత్తం లేకుండా ఫలితాలు బయటకొస్తున్నాయి. ఉన్న నియోజకవర్గాల కన్నా ఒకట్రెండు నియోజకవర్గాలను ఎక్కువేసి సర్వేలు రిలీజ్చేస్తున్నారు. ఏదైనా ఓ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నట్లు సర్వేలు బయటకొస్తే.. ప్రత్యర్థి పార్టీల నేతలు ఆ సర్వేను మార్ఫింగ్ చేసి.. తమకు కావాల్సినన్ని స్థానాలు వేసుకుంటున్నారు. జనాలను కన్ఫ్యూజన్లోకి నెట్టి లాభపడాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
నేషనల్ మీడియా పేరిట ఫేక్ రిపోర్ట్
గత రెండు రోజుల నుంచి నాలుగైదు ఫేక్ సర్వేలు సోషల్మీడియాలో వైరల్అవుతున్నాయి. రెండు రోజుల క్రితం వచ్చిన ఓ సంస్థ సర్వేలో నారాయణఖేడ్నుంచి సురేశ్షెట్కార్ గెలుస్తారంటూ పేర్కొన్నారు. కానీ, అక్కడ సురేశ్ షెట్కార్ పోటీ చేయడం లేదు. అక్కడ కాంగ్రెస్ నుంచి సంజీవ్రెడ్డి బరిలో ఉన్నారు. తాజాగా బయటకొచ్చిన మరో సర్వేలో కొత్తగూడెంలో కాంగ్రెస్ గెలుస్తుందని పేర్కొన్నారు. కానీ, అక్కడ సీపీఐ బరిలో ఉంది. లగడపాటి రాజగోపాల్రెడ్డి పేరిట మరో సర్వే ఫలితాన్ని సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాగా మాజీ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్ఎన్నికల సర్వేలనే మానేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, ఆయన సర్వే చేశారంటూ ఫేక్ సర్వే రిపోర్టును సర్క్యులేట్చేస్తున్నారు. మరో ప్రముఖ సంస్థ మంగళవారం విడుదల చేసిన సర్వేలో ఓ పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తే.. ఆ పార్టీ స్థానంలో ప్రత్యర్థి పార్టీ పేరు చేర్చి.. ఫేక్ సర్వే సృష్టించారు. మరో సర్వేలోనైతే రాష్ట్రంలో ఉన్న స్థానాలకన్నా రెండు స్థానాలను ఎక్కువే వేసి సర్వే రిపోర్టు రిలీజ్ చేశారు. రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉండాల్సిన సీట్ల కన్నా ఒక్కో సీటును ఎక్కువేసి సర్వేని పబ్లిష్ చేశారు. అన్ని సర్వేలూ కాంగ్రెస్వైపే మొగ్గుతున్నాయంటూ ఓ నేషనల్మీడియా పేరిట మరో సర్వేనూ కొందరు వ్యక్తులు సోషల్మీడియాలో వైరల్ చేశారు. అది ఫేక్ అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నరు
ఫేక్సర్వేలు హల్చల్చేస్తుండటంతో జనాలు కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. వాస్తవానికి జనాలను గందరగోళానికి గురిచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఫేక్సర్వేలను సోషల్మీడియాలో వదిలి విపరీతంగా ప్రచారంలోకి తెస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.