
- ప్లానింగ్ లేక పరేషాన్
- అలీసాగర్ లిఫ్ట్ ఆయకట్టు నీటిపాలు... ఆఫీసర్ల నిర్లక్ష్యమే అంటున్న రైతులు
నిజామాబాద్, వెలుగు: ఆఫీసర్ల సమన్వయం లోపం అలీసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. వందల ఎకరాల పంటలు నీటి పాలు కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో పంటలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం 1998లో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. 2004లో ఈ రెండు లిఫ్ట్ స్కీమ్లకు మోక్షం లభించింది. ఈ స్కీమ్లతో వర్షాకాలం పంటతో పాటు యాసంగి పంటలకు పుష్కలంగా సాగు నీరు అందుతోంది. బోధన్ డివిజన్లో రెంజల్, నవీపేట్, బోధన్ ఎడపల్లి మండలాలకు రెండు పంటలను సాగు చేస్తున్నారు. ఒక్క అలీసాగర్ లిఫ్ట్ పరిధిలోనే సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది.
పర్యవేక్షణ లోపంతోనే..
అలీసాగర్ పథకానికి మూడు స్టేజీలు ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ నవీపేట మండలం కోస్లి, సెకండ్బాగేపల్లి, థర్డ్స్టేజ్ ఎడపల్లి మండలం జానకంపేట్వద్ద ఉంది. సెకండ్స్టేజ్లో ఎత్తిపోతల మోటర్లను ప్రారంభించి సాగు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నీరు కాల్వల ద్వారా పోచారం చెరువులోకి వచ్చి చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు అలుగు పోస్తోంది. చెరువు నిండి కాల్వల ద్వారా వచ్చిన నీటితో పంటలు ముంపునకు గురువుతున్నాయి. ఎడపల్లి మండలం పోచారం చెరువు పరిధిలో దాదాపు100 ఎకరాల పంట నష్టం జరిగింది. వంద ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వరద అధికంగా ఉన్నప్పుడు మూడో స్టేజీ వద్ద మోటార్లను ప్రారంభిస్తే ఈ సమస్య తలెత్తేది కాదు. అయితే సెకండ్ స్టేజ్ వద్ద అవసరాన్ని బట్టి మోటార్లను ప్రారంభించాలి. ప్రస్తుతం రెండు మోటార్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ముంపు సమస్య వస్తోంది. దీంతో పాటు చెరువు నిండిన తర్వాత ఆ నీరు వెళ్లేందుకు ఉన్న కాల్వను చిన్నదిగా మారింది. పైగా సీసీ లేకపో వడంతో నీరు పంట పొలాల్లోకి చేరుతోంది.
రైతుల ఆందోళన..
అలీసాగర్ ఎత్తిపోతల పథకం సెకండ్ స్టేజీ వద్ద బోరు మోటార్లు ప్రారంభించిన అధికారులు నీటి ప్రవాహన్ని బట్టి పంటలకు నష్టం వాటిల్ల కుండా చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. నీటి ప్రవాహం చెరువు అలుగు నీరు వెళ్లేందుకు ఓవర్ ప్లో సీసీ కాల్వలను నిర్మించకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో పాటు సెకండ్ స్టేజ్ నుంచి సాగునీటిని విడుదల చేస్తే నీటి ఉధృతి అనుసరించి మూడో స్టేజీలో ఉన్న మోటార్లను ఆన్ చేయకపోవడంతో వందలాది ఎకరాలు నీటమునుగుతున్నాయి. లిఫ్ట్ నీటి సరఫరాపై పర్యవేక్షణ లోపంతో సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల అలీసాగర్ ఎత్తిపోతల పథకం అస్తవ్యస్తంగా తయారైందని మండిపడుతున్నారు.
పొలాలు చెరువులైనయ్..
లిఫ్ట్ నిర్వహణలో ఆఫీసర్లకు ప్లానింగ్ లేదు. అందుకే ముంపు సమస్య వస్తోంది. బాగేపల్లి లిఫ్ట్ ద్వారా విడుదల అవుతున్న నీరంతా పోచారం చెరువులోకి వస్తోంది. అది నిండి పంట పొలాల్లోకి నీరు చేరడంతో ఇసుకమేటలు వేస్తున్నాయి. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. - సాయిలు, రైతు
పరిహారం ఇప్పించాలె..
ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే పొలాల్లోకి నీళ్లు వస్తున్నాయి. ఒక్కో రైతుకు దాదాపు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులకు పరిహారం ఇయ్యాలి. నిర్లక్ష్యంగా డ్యూటీలు చేస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాస్, రైతు