- పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు
ఆదిలాబాద్, వెలుగు: మొంథా తుపాన్ ఎఫెక్ట్ తో రెండు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడుతున్నాయి. బుధవారం పొద్దంతా మబ్బు కమ్మేసింది. చలికాలం కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం నుంచే చల్లటి గాలులు వీచాయి. వర్షం నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. సోయాను చేల వద్దే కుప్పగా పోసి, పాలిథిన్కవర్లు కప్పారు. సోయా పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున చేలల్లోనే నిల్వ చేసుకున్నారు.
ఇప్పుడు తుపాన్ ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో తేమ శాతం పెరిగిపోయి, ముక్కిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వర్షాలు, అటు మంచుతో పత్తి పింజలు తడిసిపోయి ఏరేందుకు వీల్లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే పత్తి ఏరిన కొంతమంది రైతులు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చి అక్కడే ఆరబెట్టుకుంటున్నారు.
