
- పంటలను నాశనం చేసే ఫంగస్ సీజ్
- ఆగ్రో టెర్రరిజానికి ప్రయత్నించినట్టుగా ఎఫ్ బీఐ అనుమానాలు
వాషింగ్టన్: అమెరికా ఇద్దరు చైనా రీసెర్చర్లను అరెస్టు చేసింది. ఫ్యూసేరియం గ్రామినారమ్ అనే శాస్త్రీయ నామం గల ప్రమాదకరమైన ఫంగస్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకుంది. మిచిగన్ యూనివర్సిటీలో పరిశోధకురాలిగా పని చేస్తోన్న యుంకింగ్ జియాన్ ను అరెస్టు చేశామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తెలిపింది. ఆమె అరెస్టును ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మంగళవారం ధ్రువీకరించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు.
ఈ ఫంగస్ ఆగ్రో టెర్రరిజం ఏజెంట్ అని.. గోధుమ, మొక్కజొన్న, వరి, బార్లీ పంటలను నాశనం చేస్తుందని, మనుషులు, పశువుల ఆరోగ్యానికి నష్టం చేస్తుందని తెలిపారు. ఇది ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాలకు కారణమవుతుందని చెప్పారు. గతంలో ఇదే యూనివర్సిటీలో పని చేసి ప్రస్తుతం చైనా వర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఆమె ప్రియుడు జున్యోంగ్ లియూపై కూడా కుట్ర, మోసం, తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వడం లాంటి అభియోగాల కింద అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
చైనా నుంచి అక్రమంగా రవాణా చేయడానికి ఈ ఫంగస్ కు అనుమతి లేదన్నారు. డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్టు ద్వారా ఫంగస్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామని వివరించారు. మిచిగన్ యూనివర్సిటీ ల్యాబ్లో పరీక్షల కోసం ఆ రూట్లో స్మగ్లింగ్ చేసినట్టు తెలుస్తోందని వెల్లడించారు. మిచిగన్ వర్సిటీ ల్యాబ్లోనే లియూ గర్ల్ఫ్రెండ్ జియాన్ గతంలో పనిచేసిందన్నారు.