- ఫోకస్లో డాయిచ్ బ్యాంక్..జర్మనీ మార్కెట్ 3% క్రాష్
- యూబీఎస్పై యూఎస్లో దర్యాప్తు..
- మార్కెట్లను వెంటాడుతున్న బ్యాంకింగ్ సంక్షోభం
బిజినెస్ డెస్క్, వెలుగు: బ్యాంక్ సంక్షోభ భయాలు మరోసారి ఇన్వెస్టర్లను భయపెట్టాయి. యూఎస్ ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకింగ్ క్రైసిస్ కొనసాగుతుందనే ఆందోళనలు, ఈ ప్రభావం యూరోపియన్ బ్యాంకులకు కూడా పాకిందనే భయాలు పెరిగాయి. జర్మనీ బ్యాంక్ డాయిచ్ క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్( సీడీఎస్– లోన్లు డీఫాల్ట్ కాకుండా ఒక విధమైన ప్రొటెక్షన్) లు రాత్రికి రాత్రే 142 బేసిస్ పాయింట్ల నుంచి 173 బేసిస్ పాయింట్లకు పెరగడం ఇన్వెస్టర్లను భయపెట్టింది. అంటే ఈ బ్యాంక్ డీఫాల్ట్ ప్రభావం ఇన్వెస్టర్లపై తక్కువగా ఉండేలా చేయడానికి ఇష్యూ చేసే సీడీఎస్లు ఖరీదుగా మారాయి. డాయిచ్ బ్యాంక్ మరో క్రెడిట్ స్వీస్ అవుతుందా? అనే భయాలు ఎక్కువవ్వడంతో జర్మనీ స్టాక్ ఎక్స్చేంజ్ డాక్స్ శుక్రవారం ఇంట్రాడేలో 3 శాతం మేర క్రాష్ అయ్యింది. డాయిచ్ బ్యాంక్ షేర్లు 14 శాతం మేర పడగా, మార్కెట్ క్యాప్ 3 బిలియన్ డాలర్లు తగ్గింది. మిగిలిన యూరోపియన్ బ్యాంకులయిన కామర్జ్ షేర్లు 9 %, క్రెడిట్ స్వీస్, సోసైటీ జనరలే, యూబీఎస్ బ్యాంక్ షేర్లు 7 % పడ్డాయి. బార్క్లేస్, బీఎన్పీ పారిబా షేర్లు 6 శాతం చొప్పున పతనమయ్యాయి.
క్రెడిట్ స్వీస్–యూబీఎస్కు ఫెడ్ అప్పు..
ఫారిన్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ అథారిటీస్ (ఎఫ్ఐఎంఏ) రెపో ఫెసిలిటీ కింద యూఎస్ ఫెడ్ ఇచ్చే లోన్లు సడెన్గా 60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అత్యవసర సమయాల్లో ఫారిన్ సెంట్రల్ బ్యాంకులకు సాయం చేసేందుకు ఈ ఫెసిలిటీ కింద ఫెడ్ లోన్లు ఇస్తోంది. క్రెడిట్ స్వీస్– యూబీఎస్ డీల్ కోసం ఈ లోన్ ఇచ్చిందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. కానీ, ఈ అంశంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఫెడ్ రంగంలోకి దిగిందనే వార్తలతో మార్కెట్లు శుక్రవారం పడ్డాయి. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. వెస్ట్రన్ దేశాలు విధించిన ఆంక్షల నుంచి తప్పించుకోవడంలో రష్యన్ ఒలిగార్క్స్కు యూబీఎస్, ఈ బ్యాంక్ సబ్సిడరీ సాయం చేశాయని, యూఎస్లో వీటిపై దర్యాప్తు జరుగుతోందనే వార్తలొచ్చాయి. ఫలితంగా యూబీఎస్ షేర్లు నష్టపోయాయి.
గ్లోబల్ మార్కెట్లు ఢమాల్..
గ్లోబల్ మార్కెట్లు శుక్రవారం సెషన్లో భారీగా పడ్డాయి. యూరో స్టాక్స్ 50 రెండు శాతం పడగా, జర్మనీ డాక్స్ 3 శాతం, ఇంగ్లండ్ ఎఫ్టీఎస్ఈ 100 ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫ్రాన్స్ సీఏసీ 40 2 శాతం పడింది. మరోవైపు ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ మార్కెట్స్ లాస్లో ట్రేడయ్యాయి.
బ్యాంకింగ్ క్రైసిస్పై ఈయూ లీడర్ల మీటింగ్..
బ్యాంకింగ్ క్రైసిస్ ప్రభావాన్ని అంచనావేసేందుకు యూరోపియన్ యూనియన్ లీడర్లు శుక్రవారం బ్రస్సెల్లో సమావేశమయ్యారు. ఆందోళన పడడానికి ఏం లేదని బెల్జియం ప్రైమ్ మినిస్టర్ అలెగ్జాండర్ డీ క్రో అన్నారు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని పేర్కొన్నారు.
ఫారెక్స్ నిల్వలు 6 వారాల గరిష్టానికి..
దేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల 17 తో ముగిసిన వారంలో 12.8 బిలియన్ డాలర్లు పెరిగి 572.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఆరు వారాల్లో ఇదే హయ్యస్ట్. అంతకు ముందు వారంలో ఫారెక్స్ నిల్వలు 560 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ఇండియా ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) ఈ నెల 17 తో ముగిసిన వారంలో 10.49 బిలియన్ డాలర్లు పెరిగి 505.34 బిలియన్ డాలర్లకు, గోల్డ్ రిజర్వ్లు 2.19 బిలియన్ డాలర్లు పెరిగి 44.11 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.