
భార్యాభర్తల గొడవ కారణంగా మునిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన లుఫ్తాన్సా ఫ్లైట్ను దిల్లీకి మళ్లించారు. ఈ ఘటన బుధవారం( నవంబర్ 29) జరిగింది. విమానంలో ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని క్యాబిన్ క్రూ (విమానం సిబ్బంది) చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది భార్యాభర్తల మధ్య గొడవగా చెప్పారు. ఢిల్లీ విమానాయశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి... అనుచితంగా ప్రవర్తించిన భర్తను విమానం నుంచి కిందకు దించేసి విమానాశ్రయ భద్రతా సిబ్బందికి అప్పగించారు.
మ్యూనిచ్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో తోపులాట జరిగింది. విమానం లోపల పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. లుఫ్తాన్సా ఫ్లైట్ నంబర్ LH772 మ్యూనిచ్ నుండి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కి వెళ్తోంది.
గొడవ తర్వాత విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు
భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి ఈ వార్త అందిన వెంటనే, భద్రతా సిబ్బంది విమానాశ్రయానికి చేరుకుని విమాన గేట్లు తెరవడానికి ప్రయత్నించారు.
ఇంతకుముందు ఈ విమానాన్ని భారత్కు పొరుగున ఉన్న పాకిస్థాన్లో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడి విమానాశ్రయ అధికారులు అనుమతించలేదని విమాన సిబ్బందిచెబుతున్నారు. అనంతరం విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు.
గొడవకు కారణం తెలియరాలేదు
అయితే భార్యాభర్తలు ఎక్కడివారు, వారి మధ్య గొడవకు కారణం ఏమిటనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని విమానం నుంచి బయటకు తీసి భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి లుఫ్తాన్సా ఎయిర్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Also Read :-5 రాత్రులు నిద్రపోకుండా లైవ్ గేమ్ చైనా స్టూడెంట్ మృతి