న్యూఢిల్లీ : అప్పులు ఇచ్చే టైములోనే నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గురువారం సూచించారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన గైడెన్స్ను పాటించాలని చెప్పారు. బిజినెస్ పెంచుకునే విషయంలో దూకుడు ప్రదర్శించడం కాకుండా, ఆర్బీఐ రూల్స్సక్రమంగా పాటిస్తూ గ్రోత్ సాధించాలని నిర్మలా సీతారామన్ సలహా ఇచ్చారు. డేట్ విత్ టెక్ పేరిట జరిగిన ఒక ఈవెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు.
బిజినెస్ పెంచుకోవాలనే ఆశ మంచిదేనని, కాకపోతే కొన్ని సందర్భాలలో ఇది ఇబ్బందులు తేవొచ్చని అన్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఆర్బీఐ ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు హెచ్చరిక జారీ చేస్తోందని పేర్కొన్నారు. ఎన్బీఎఫ్సీలు అప్పులు ఇవ్వడంలో దూకుడు ప్రదర్శించి, ఆ తర్వాత సమస్యలను కొని తెచ్చుకోకూడదనే తమ అభిప్రాయమని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీని దృష్టిలో పెట్టుకునే ఎన్బీఎఫ్సీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు ఇంతకు ముందే వార్నింగ్ జారీ చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇది ముందు జాగ్రత్త చర్యేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అన్సెక్యూర్డ్లోన్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో పాటు, చెల్లింపులలో ఎగవేతలు కూడా అలాగే ఎక్కువవుతుండటంతో ఆర్బీఐ ఈ వార్నింగ్ ఇచ్చింది. అన్సెక్యూర్డ్ లోన్లకు రిస్క్ వెయిట్ ఎక్కువ చేయమని ఆర్బీఐ ఎన్బీఎఫ్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్సెక్యూర్డ్ కన్జూమర్ లోన్లు, క్రెడిట్ కార్డులపై రిస్క్ వెయిట్ను 25 పర్సంటేజ్ పాయింట్లు పెంచి 125–150 శాతంగా మార్చింది. ఈ నిర్ణయం వల్ల ఒక్క బ్యాంకులపైనే రూ. 84 వేల కోట్ల క్యాపిటల్ కాస్ట్ పడుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. హౌసింగ్లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వెహికల్ లోన్లు, గోల్డ్ లోన్లను తాజా రిస్క్ వెయిట్ నుంచిమినహాయించారు.
పాత, కొత్త లోన్లకూ హై రిస్క్ వెయిట్...
ఇప్పటికే ఇచ్చిన అన్సెక్యూర్డ్ లోన్లకు, కొత్తగా ఇచ్చే లోన్లకు కూడా కొత్త రూల్ వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. రిస్క్ వెయిట్ అంటే ఇచ్చే అప్పుల కోసం ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కొంత మొత్తాన్ని పక్కకు పెట్టడం. దీని వల్ల బ్యాంకుల మూలధన ఖర్చు ఎక్కువవుతుంది. అంతేకాదు, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల అప్పులు ఇచ్చే కెపాసిటీ కొంత మేర తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్ విషయంలోనే ఇదే తరహా ఆదేశాలను ఆర్బీఐ జారీ చేసింది.
సెప్టెంబర్ 2023 చివరి నాటికి పర్సనల్ లోన్లు రూ. 48,26,833 కోట్లకు చేరాయి. 2022 సెప్టెంబర్ చివరితో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. కన్జూమర్ క్రెడిట్ విషయంలో బోర్డ్ లెవెల్లో రివ్యూలు జరిపి, అవసరమైతే కొన్ని పరిమితులు విధించుకోవాలని కూడా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ సూచించింది. అన్ని కేటగిరీల అన్సెక్యూర్డ్ లోన్ల విషయంలోనూ లిమిట్స్ పెట్టుకోవాలని సలహా ఇచ్చింది.
అకౌంట్ యాగ్రిగేటర్ల చేతిలో డేటా సేఫే
అకౌంట్ యాగ్రిగేటర్లతో పంచుకున్న డేటా భద్రంగానే ఉంటుందని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అకౌంట్ యాగ్రిగేటర్ స్కీము తాను అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదని చెబుతూ, ఈ విషయంలో అవగాహనను బహుశా మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే, టెక్నాలజీని మరింత ఈజీ చేయాల్సి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో ఈ అంశంపై డిస్కషన్స్ జరిగాయని, అకౌంట్ యాగ్రిగేటర్స్ వర్కింగ్లో బ్యాంకులు భాగమయ్యాయని అన్నారు. ఈ సిస్టమ్ బ్యాంకులకు కొంత సాయపడుతుందనే ఫీడ్బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు.
అకౌంట్ యాగ్రిగేటర్ల చేతిలోనే డేటా ఉంటుందని మొదట్లో భయాలు వ్యక్తమయ్యాయని, కానీ నిజానికి వాటి ద్వారా డేటా బదిలీ మాత్రమే జరుగుతుందని, యాగ్రిగేటర్లు డేటాను అట్టిపెట్టుకునే వీలు లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. కస్టమర్ అప్పు తీసుకునేటప్పుడు, బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు మాత్రమే అకౌంట్ యాగ్రిగేటర్లు డేటాను వాడతాయని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్ల మధ్య వారధిగా అకౌంట్ యాగ్రిగేటర్ సిస్టమ్ను తీసుకొచ్చారు. కస్టమర్లు ఇచ్చే అనుమతి మేరకే ఈ సిస్టమ్ పనిచేస్తుంది.