- మెరుగైన పొజిషన్లో అగ్రికల్చర్, సర్వీసెస్, ఇండస్ట్రీస్ సెక్టార్లు..
- పేర్కొన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ గ్రోత్ రేటు 6.5 శాతంగా ఉంటుందని, ఈ విషయంలో ఆర్బీఐ, ప్రభుత్వం ఒకేలా ఆలోచిస్తున్నాయని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ శనివారం అన్నారు. 2023–24 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ మీటింగ్లో వేసిన 6.4 శాతం అంచనాను కొద్దిగా సవరించింది. గ్లోబల్గా ఎటువంటి రిస్క్లు ఉన్నా, మన ఎకానమీ వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని నాగేశ్వరన్ ధీమా వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతుండడంతో పాటు మాక్రో ఎకానమీ స్టేబుల్గా ఉండడంతో లాభపడతామని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఈవెంట్లో ఆయన పేర్కొన్నారు. ‘కిందటి ఫైనాన్షియల్ ఇయర్లో దేశ రియల్ జీడీపీ గ్రోత్ 7.2 శాతంగా రికార్డయ్యింది. ఇంతకంటే ఎక్కువ ఉండాలి. 2021–22 లో నమోదైన 9.1 శాతం కంటే ఇది తక్కువ’ అని అన్నారు. పెద్ద ఎకానమీలలో ఇండియా వేగంగా వృద్ధి చెందుతోందని, ఏప్రిల్కు సంబంధించి అన్ని ఇండికేటర్లు సానుకూల సంకేతాలను ఇచ్చాయని నాగేశ్వరన్ వివరించారు. ‘కిందటి ఆర్థిక సంవత్సరంలో గూడ్స్, సర్వీస్ల ఎక్స్పోర్ట్స్ జీడీపీలో 23.5 శాతానికి చేరుకున్నాయి. 2015 తర్వాత ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం. కరోనా తర్వాత చూస్తే ప్రజలు ఖర్చులు చేయడం కిందటి ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. సిటీలలో వినియోగం పెరగడంతో ప్రైవేట్ కన్జంప్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా పెంటప్ డిమాండ్తో వినియోగం మెరుగుపడింది’ అని ఆయన వెల్లడించారు.
సెక్టార్లు మెరుగ్గా..
అగ్రికల్చర్ సెక్టార్ గురించి నాగేశ్వరన్ మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం కొంత ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కానీ, రిజర్వాయర్లలో సరిపడినంత వాటర్ ఉందని, సరిపడినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కంపెనీలు తమ కెపాసిటీని విస్తరించడంపై ఫోకస్ పెట్టాయని, కన్స్ట్రక్షన్, సిమెంట్, స్టీల్ సెక్టార్లలో యాక్టివిటీ పెరిగిందని పేర్కొన్నారు. విదేశీ టూరిస్ట్లు వస్తుండడంతో కరోనా ముందు స్థాయికి సర్వీస్ సెక్టార్ చేరుకుందని, హోటల్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోందని నాగేశ్వరన్ అన్నారు.
ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతోంది..
కరోనా టైమ్లో ఎలా పడితే అలా ఖర్చులు చేయలేదని, కానీ, అర్హులను దృష్టిలో పెట్టుకొని వివిధ స్కీమ్లు తెచ్చామని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితులు మంచి స్థాయిలో ఉన్నాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందని అంచనావేశారు. ఫారిన్ రిజర్వ్లు 10 నెలల ఇంపోర్ట్స్ను కవర్ చేయడానికి సరిపోతాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ను మెరుగుపరుస్తూనే ట్యాక్స్ రెవెన్యూపై ఫోకస్ ఉండేలా ప్రభుత్వ పాలసీ ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) జాయింట్ సెక్రెటరీ రమన్ చోప్రా అన్నారు. రెవెన్యూ కలెక్షన్లలో కొత్త రికార్డ్లు క్రియేట్ అవుతున్నాయని పేర్కొన్నారు. రిటర్న్లను అప్డేట్ చేసుకోవడానికి తాజాగా అవకాశం ఇవ్వడంతో లిటిగేషన్లు తగ్గుతాయని, రెవెన్యూ పెరుగుతుందని అంచనావేశారు.