హేట్ క్రైమ్: అమెరికాలో ఆలయంపై విద్వేషం

హేట్ క్రైమ్: అమెరికాలో ఆలయంపై విద్వేషం

 వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కొందరు దుండగులు హిందూ ఆలయంపై విద్వేషపూరిత చర్యలకు పాల్పడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లే నగరంలో ఉన్న నారాయణాలయంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఆలయం గోడలు, దేవుడి విగ్రహాలపై నల్ల పెయింట్ పోశారు. గుడిలో ఉన్న ఓ కుర్చీలో కత్తిని గుచ్చి వెళ్లారు. కిటికీలను పగలగొట్టారు. గ్రాఫిటీతో గోడల మీద వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. దీనిని హేట్ క్రైమ్ గా కేసు పెట్టి అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన గురించి తెలిసి, లూయిస్ విల్లే నగర మేయర్ జార్జ్ ఫిస్చెర్ ఆలయాన్ని సందర్శించారు. ఇటువంటి ద్వేషపూరిత చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలను తమ నగరం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలంతా మరింత ఐక్యతతో ముందుకు సాగుతారన్నారు. ఏ మతం వారైనా ఇలా చేయడం తగదని, తాము శాంతి కోసం నిలబడతామని ఆలయ అధికారులు చెప్పారు.ఈ తరహా దాడులు 2015లో కెంట్, టెక్సాస్ లలో జరిగాయి.