హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తున్నాయి. అన్ని పార్టీలకన్నా ముందే అధికార పార్టీ బీఆర్ఎస్ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్ వారం రోజుల్లో విడుదలయ్యే చాన్స్ కనిపిస్తున్నది. ఈ నెలాఖరుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటించాలని అనుకున్నా కొన్ని కారణాలతో వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. బీజేపీ జాబితా ప్రకటన ఆలస్యమైనా.. సీనియర్ లీడర్లందరూ అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనని ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశించింది. దీంతో బీజేపీలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్చివరి వారంలో, లేదా నవంబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉందని మంత్రి కేటీఆర్ ఇటీవల తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో చెప్పారు. ఏదేమైనా డిసెంబర్కన్నా ముందే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తవుతుందని పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
105 మందితో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్?
బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రెండు రోజులుగా ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 18న శ్రావణ మొదటి శుక్రవారం ఉంది. అదే రోజు లేదా ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఫస్ట్ లిస్టులోనే 105 పేర్లు ప్రకటించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 105 పేర్లు ప్రకటించకుంటే.. కేసీఆర్ లక్కీ నంబర్అయిన ‘6’ సంఖ్య వచ్చేలా అభ్యర్థుల లిస్ట్ ఉండొచ్చని చెప్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 39 మందిపై వ్యతిరేకత ఉందని, వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న పది నుంచి 15 మంది స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టు ఇండికేషన్ఇచ్చారు. ఇట్ల బీఆర్ఎస్ పెద్దలు వేదికలపై ప్రకటించిన పేర్లలో.. గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), గంగుల కమలాకర్(కరీంనగర్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), ఆరూరి రమేశ్ (వర్ధన్నపేట), నల్లమోతు భాస్కర్ రావు (మిర్యాలగూడ), ధాస్యం వినయ్భాస్కర్(వరంగల్ వెస్ట్), గాదరి కిశోర్(తుంగతుర్తి), గువ్వల బాలరాజు (అచ్చంపేట), ఆల వెంకటేశ్వర్రెడ్డి (దేవరకద్ర), శ్రీనివాస్గౌడ్(మహబూబ్నగర్), మంచిరెడ్డి కిషన్రెడ్డి (ఇబ్రహీంపట్నం), సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), చంటి క్రాంతికిరణ్(నాగర్కర్నూల్), బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల), ఆశన్నగారి జీవన్రెడ్డి(ఆర్మూరు), బిగాల గణేశ్గుప్తా (నిజామాబాద్అర్బన్), షకీల్అహ్మద్(బోధన్), జాజల సురేందర్(ఎల్లారెడ్డి), ఒడితెల సతీశ్ కుమార్ (హుస్నాబాద్) ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి, జాజల సురేందర్ ఉన్నారు.
అదేవిధంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన సండ్ర వెంకటవీరయ్య కూడా ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 11 మందికి టికెట్లపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఇందులో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్రెడ్డి (పాలేరు), హరిప్రియ నాయక్(ఇల్లెందు), సుధీర్రెడ్డి (ఎల్బీ నగర్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), బీరం హర్షవర్ధన్రెడ్డి (కొల్లాపూర్), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్)కు టికెట్లు ఖరారైనట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగూడెం టికెట్ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వర్రావు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. రెండు రోజుల కింద ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు. అయితే.. సర్వేల ఆధారంగా టికెట్ఇస్తామని, ఎన్నికల కోణంలోనే పని చేసుకోవాలని వనమాతో కేసీఆర్ అన్నట్లు సమాచారం. వీళ్లు కాకుండా ఇంకో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారు అయినట్టు సమాచారం. కేసీఆర్సోమవారం వరకు ఫామ్హౌస్లోనే ఉండే అవకాశం ఉందని, ఆలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు.
సెప్టెంబర్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్పార్టీ టికెట్ల కసరత్తును మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా లిస్టు రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని హైకమాండ్, రాష్ట్ర స్థాయిలోని పెద్ద లీడర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పీఏసీ సమావేశంలో సునీల్ కనుగోలు 35 సెగ్మెంట్లలో పార్టీ చాలా వీక్గా ఉందని రిపోర్టు ఇచ్చారు. మొత్తం 119 నియోజకవర్గాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఎలాంటి వివాదాలు లేని 40 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించనున్నారు. ఈ నెలాఖరుకే 80 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఇటీవల ప్రకటించినా.. అది సాధ్యం కాకపోవచ్చని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఖరారుపై సెప్టెంబర్ మొదటి వారంలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే మొదటి జాబితా అనౌన్స్చేయనున్నట్టు తెలుస్తున్నది. పార్టీ టికెట్ల కోసం గాంధీ భవన్కు ఆశావహులు క్యూ కడుతున్నారు. రిటైర్డ్ఆఫీసర్లతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి తమకు అవకాశం ఇవ్వాలని వాళ్లు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు.
బీజేపీ ఎంపీలు, సీనియర్లంతా అసెంబ్లీకే..!
బీజేపీ నుంచి లోక్సభ సభ్యులుగా ఉన్న నలుగురితో పాటు సీనియర్ నాయకులంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశించింది. వీరి పేర్లతోనే మొదటి జాబితా ప్రకటించే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే తమ క్యాండిడేట్ల లిస్ట్ ప్రకటన ఉంటుందని బీజేపీ ముఖ్యులు చెప్తున్నారు. ఎంపీలు, సీనియర్ లీడర్లు అసెంబ్లీకి పోటీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండికేషన్ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడ నుంచి, ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ లేదా కోరుట్ల నుంచి, సోయం బాపూరావు బోథ్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి మహబూబ్నగర్, షాద్నగర్లో ఏదో ఒక చోటు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్భువనగిరి నుంచి, మాజీ ఎంపీ విజయశాంతి మల్కాజ్గిరి ఎంపీ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి, బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు మల్కాజ్గిరి లేదా కూకట్పల్లి నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేలుగా ఉన్న ఈటల రాజేందర్ (హుజూరాబాద్), రఘునందన్ రావు (దుబ్బాక) నుంచే పోటీ చేయనున్నారు. రాజాసింగ్సస్పెన్షన్ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో గోషామహల్అభ్యర్థిత్వంపై డైలమా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న నేతలంతా ఆయా నియోజకవర్గాల్లోని కేడర్తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు.
కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో వీళ్లకు చాన్స్
కాంగ్రెస్ఫస్ట్లిస్టులో సీనియర్లీడర్లకు టికెట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (కొడంగల్), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (కొత్తగూడెం), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్గొండ), జానారెడ్డి/జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్), రఘువీర్ రెడ్డి (మిర్యాలగూడ), ఉత్తమ్ కుమార్రెడ్డి (హుజూర్నగర్), పద్మావతి (కోదాడ), సీతక్క (ములుగు), కొండా సురేఖ (వరంగల్ఈస్ట్), చిన్నారెడ్డి (వనపర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వంశీచంద్ రెడ్డి (కల్వకుర్తి), సంపత్కుమార్ (ఆలంపూర్), జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (ఆందోల్), మహేశ్కుమార్ గౌడ్ (నిజామాబాద్ అర్బన్), షబ్బీర్అలీ (కామారెడ్డి), జీవన్ రెడ్డి (జగిత్యాల), శ్రీధర్బాబు (మంథని), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), పొదెం వీరయ్య (భద్రాచలం), బల్మూరి వెంకట్ (హుజూరాబాద్) పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి టికెట్ఆశిస్తున్నారు. గిరిజన చైతన్య యాత్ర పేరిట నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈసారి నాగార్జునసాగర్ టికెట్జైవీర్రెడ్డికేనని ఒకవైపు.. జానారెడ్డికే చాన్స్ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ఉందని మరోవైపు ప్రచారం జరుగుతున్నది.
గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ చేయబోతున్నారని మంత్రి హరీశ్రావు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. శుక్రవారం గజ్వేల్నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్లో కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇటీవల మాట్లాడుతూ.. కేసీఆర్ను కామారెడ్డిలో పోటీ చేయాలని తానే ఆహ్వానించానని చెప్పారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే తన భవిష్యత్ ఏమిటనేది ఆయనే నిర్ణయిస్తారని కూడా గోవర్ధన్ అన్నారు. ఇంకోవైపు గజ్వేల్లో పోటీ చేయడానికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి కూడా ప్రయత్నాలు షురూ చేశారు. వీటన్నింటికీ తెరదించుతూ ఒంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని హరీశ్ పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్ నియోజకవర్గ మార్పుపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.