- యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో ఆఫీస్ చుట్టూ చేరిన వరద
చౌటుప్పల్, వెలుగు : కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్, లక్కారం చెరువులు అలుగు పారుతున్నాయి. దీంతో ఎంపీడీవో, ఆర్డీవో ఆఫీస్లతో పాటు 13వ వార్డులోని వినాయక నగర్లోని కొన్ని ఇండ్లు నీట మునిగాయి. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఊర చెరువు నిండి అలుగు పోయడంతో ఎంపీడీవో ఆఫీస్ను వరద చుట్టుముట్టింది. ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో మోకాలి లోతు నీరు నిలువగా.. ఆఫీస్ లోపల సైతం అడుగులో నీరు చేరింది.
దీంతో ఆఫీస్లోని డాక్యుమెంట్లు, కంప్యూటర్లను మొదటి అంతస్తులోకి తరలించారు. వరద ప్రభావం కారణంగా ఎంపీడీవో ఆఫీస్ను తాత్కాలికంగా చౌటుప్పల్లోని ఎంఈవో ఆఫీస్లోకి మార్చారు. మరో వైపు ఆర్డీవో ఆఫీస్ చుట్టూ వరద చేరడంతో పాటు ఆవరణలో ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఆర్డీవో ఆఫీస్కు వెళ్లే దారులను మూసివేశారు. వరద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్థానిక ఆఫీసర్లతో కలిసి అలుగు ప్రాంతాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి పక్కనున్న సర్వీస్ రోడ్డు, అండర్ డ్రైనేజీ మీదుగా వరద వెళ్లేలా ఏర్పాట్లు చేయించారు. ఆఫీసర్లు అలర్ట్గా ఉండి ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
