
న్యూఢిల్లీ: ఈ నెల 14తో ముగిసిన వారంలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా రూ.3,048 కోట్లను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. గత వారం రూ.10,800 కోట్ల భారీ ఉపసంహరణతో పోలిస్తే ఇది తక్కువ. నిఫ్టీ 24,631 వద్ద, సెన్సెక్స్ 80,597 వద్ద శుక్రవారం ముగిశాయి. కిందటి వారాన్ని ఒక శాతం లాభంతో ముగించాయి. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల వల్లే ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయని ఫైనాన్షియల్ కంపెనీ మార్నింగ్స్టార్ పేర్కొంది. మరోవైపు ఈ నెల 14తో ముగిసిన వారంలో డెట్ మార్కెట్లో రూ.2,063 కోట్లను ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేశారు.
ఈ వారం మార్కెట్ పైకే..
యూఎస్–ఇండియా వాణిజ్య సంబంధాలు, ట్రంప్ విధించిన టారిఫ్లు మార్కెట్పై ప్రభావం చూపనున్నాయి. యూఎస్, రష్యా సంబంధాలు మెరుగవడం వల్ల ఇండియాపై 25 శాతం అదనపు టారిఫ్ అమలు కాకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జీఎస్టీ తగ్గింపు, ఎస్ అండ్ పీ రేటింగ్ అప్గ్రేడ్ వంటి పాజిటివ్ ట్రిగ్గర్స్తో సోమవారం మార్కెట్ ర్యాలీ చేయొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.