- దేశంలో డబ్బులు పెట్టేందుకు వెనుకాడని ఎఫ్పీఐలు
- ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లలోకి ఎక్కువ పెట్టుబడులు
- సౌత్ కొరియా కంటే 10 రెట్లు, ఇండోనేషియా కంటే 7 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు
- ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐల) కు ఇండియన్ స్టాక్ మార్కెట్లు తెగ నచ్చేసినట్టు కనిపిస్తోంది. ఇతర ఎమెర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లలోకి ఎక్కువగా పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 11 వరకు చూసుకుంటే, 2.1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఫారిన్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఇదే టైమ్లో సౌత్ కొరియా మార్కెట్లోకి వచ్చిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ల కంటే ఇండియాలోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు 10 రెట్లు ఎక్కువ. ఇండోనేషియా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ. గత 12 నెలల్లో డొమెస్టిక్ మార్కెట్లో 34.3 బిలియన్ డాలర్లను ఎఫ్పీఐలు పెట్టారు. ఇదే టైమ్లో అతిపెద్ద ఎమెర్జింగ్ కంట్రీ బ్రెజిల్లోకి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఇండియాలోకి ఏకంగా 20 బిలియన్ డాలర్లు ఎక్కువ పెట్టుబడులొచ్చాయి. కరోనా ఫస్ట్వేవ్ నుంచి ఎకానమీ ఇంకా రికవరీ కాకపోయినా, రికార్డ్ లెవెల్స్లో కన్జూమర్ల సెంటిమెంట్ పడిపోయినా దేశీయ మార్కెట్లలోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు రావడం ఆగలేదు. ఈ ఏడాది కరోనా సెకెండ్ వేవ్తో దేశ ఎకానమీ నష్టపోయింది. వ్యాక్సినేషన్ ప్రాసెస్ మెల్లగా జరగడం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఒత్తిడి పెరగడం వంటివి డొమెస్టిక్ ఇన్వెస్టర్లను ఆపినా, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను మాత్రం అడ్డుకోలేకపోయాయి. ప్రస్తుతం దేశ ఈక్విటీ మార్కెట్లు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మార్కెట్లలో ఒకటిగా ఉన్నాయి. ఎమెర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే ఒక్క ఇండియన్ మార్కెట్లే ప్రీమియంతో ట్రేడవుతుండడాన్ని గమనించాలి.
ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు ఎందుకొస్తున్నాయంటే!
కరోనా సంక్షోభం తర్వాత ఇతర దేశాలలో మాక్రో ఎకనామిక్ కండీషన్లు మరింత అధ్వాన్నంగా మారాయి. కానీ, ఇండియాలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు, ప్రైవేట్ సెక్టార్ అప్పులు వంటి మాక్రో కండీషన్లను ఇండియా కంట్రోల్లో ఉంచగలిగిందని బ్రోకరేజి కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర 600 బిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు ఉన్నాయి. దీనికి తోడు ఫారిన్ కరెన్సీల మారకంలో రూపాయి నిలకడగా ట్రేడవుతోంది. కరెన్సీలో భారీ కదలికలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు నష్టపోవడం లేదని, ఎఫ్పీఐలు సేఫ్గా ఫీలవుతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. దేశ మాక్రో ఎకనామిక్ కండీషన్లను రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ చేయగలుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న అప్పుల వలన బాండ్ మార్కెట్లో ఎటువంటి భయాందోళనలు క్రియేట్ కాకుండా చూసుకోగలిగింది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో డబ్బులు పెడుతుండడానికి ఇదొక కారణం.
ఇండియన్ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నయ్..
విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి మరొక కారణం, ఇండియన్ కంపెనీల ఆదాయాలు మెరుగుపడడమే. ప్రస్తుతం ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎర్నింగ్స్ వేగంగా పెరుగుతున్నాయని బ్రోకరేజి కంపెనీలు చెబుతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత చైనా గ్రోత్ తగ్గిపోతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా చైనా ఇక కొనసాగలేదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశ జీడీపీ గ్రోత్ రేటు 10 శాతానికి చేరువలో ఉందని, ప్రాఫిట్స్ గ్రోత్ 35 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్నారు. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాను ఎంచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇండియన్ మార్కెట్లో రిస్క్ తక్కువగా ఉండడం, లాభాలు ఎక్కువగా ఉంటుండడంతో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. వీటికి అదనంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ఎమెర్జింగ్ మార్కెట్ పోర్టుఫోలియోలో ఇండియా వెయిటేజి ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. దేశ ఈక్విటీ మార్కెట్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నా, విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఇండియన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారని చెప్పారు.