బీఆర్ఎస్​ఎల్పీ నేతగా కేసీఆర్ .. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్​ఎల్పీ నేతగా కేసీఆర్ .. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​ శాసనసభ పక్ష(ఎల్పీ) నేతగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్​లో నిర్వహించిన బీఆర్ఎస్​ ఎల్పీ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్​ కె.కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన ఎల్పీ సమావేశంలో మాజీ స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి శాసనసభ పక్షనేతగా కేసీఆర్​పేరు ప్రతిపాదించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు చప్పట్లతో ఆమోదం తెలిపారు. శాసనసభ పక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్​కు అప్పగిస్తూ సమవేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

కేసీఆర్​ తుంటి ఎముక విరగడంతో సిటీలోని యశోద హాస్పిటల్​లో ఆయనకు ఆపరేషన్​చేశారు. దీంతో ఆయన సమావేశానికి హాజరుకాలేదు. కేసీఆర్​తో పాటే హాస్పిటల్​లో ఉన్న బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్పీ సమావేశానికి రాలేదు. మాజీ డిప్యూటీ స్పీకర్ ​పద్మారావు గౌడ్ ​స్థానికంగా లేకపోవడంతో హాజరవలేదు. ముషీరాబాద్​ఎమ్మెల్యే ముఠా గోపాల్​తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లడంతో ఎల్పీ మీటింగ్​కు రాలేదు. వీరు మినహా మిగతా 35 మంది ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

గన్​పార్క్​లో అమరవీరులకు నివాళులు

తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు అక్కడే బ్రేక్​ఫాస్ట్​చేశారు. ఆ తర్వాత అందరు కలిసి ఒకే బస్​లో గన్​పార్క్​కు చేరుకున్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు.