అవినీతి కేసుల్లో దోషిగా మలేసియా మాజీ ప్రధాని నజీబ్

అవినీతి కేసుల్లో దోషిగా మలేసియా మాజీ ప్రధాని నజీబ్

పుత్రజయ(మలేసియా): అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్​ రజాక్​కు జైలు శిక్ష ఖరారైంది. కింది కోర్టు తనకు విధించిన 12 ఏండ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్​ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్​ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. నజీబ్  అప్పీల్​లో మెరిట్ లేదని, ఆయన శిక్షను వెంటనే అమలు చేయాలని చీఫ్​ జస్టిస్​ మియామున్​ ట్వాన్​ మాట్ తీర్పిచ్చారు. కోర్టు తీర్పుతో నజీబ్, ఆయన ఫ్యామిలీ, మద్దతుదారులు విచారంలో మునిగిపోయారు.

మాజీ ప్రధానులలో జైలుపాలైన తొలి వ్యక్తి నజీబ్​ రజాక్. 1మలేసియా డెవలప్​మెంట్​ బెర్హాద్(1ఎండీబీ) స్కాం కేసులో హైకోర్టు నజీబ్​కు 12 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై నజీబ్​ ఫెడరల్​ కోర్టులో ఫైట్​ చేశారు. నజీబ్​కు శిక్ష విధించడం సబబేనని ఫెడరల్​ కోర్టు ప్యానెల్​ మంగళవారం తేల్చింది. ఈ కేసులో ఇదే ఫైనల్​ తీర్పు కావడంతో నజీబ్​ ఇక జైలుకెళ్లక తప్పదని అధికారవర్గాలు తెలిపాయి.

ఏంటీ 1ఎండీబీ స్కామ్..

మలేసియా ప్రధానిగా 2009లో నజీబ్​ రజాక్​ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే 1ఎండీబీ పేరుతో డెవలప్​మెంట్​ ఫండ్​ను ఏర్పాటు చేశారు. ఈ ఫండ్​లో అక్రమాలు జరిగాయని, నిధులను నజీబ్ తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 4.5 బిలియన్​ అమెరికన్​ డాలర్లు(రూపాయల్లో దాదాపు 36 వేల కోట్లు) కాజేశారని లెక్కల్లో తేలింది. 1ఎండీబీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఎస్​ఆర్​సీ ఇంటర్నేషనల్​సంస్థ నిధుల్లోనూ గోల్​మాల్​ జరిగిందని, 9.4 మిలియన్​డాలర్లు(రూపాయల్లో 75 కోట్లు) అక్రమంగా తీసుకున్నారని బయటపడింది.

ఈ డబ్బును విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపేందుకు, ఖరీదైన వాహనాల కొనుగోలుకు ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై సొంత ప్రభుత్వంలోని పలువురు సభ్యులు ఆరోపణలు గుప్పించగా.. వాళ్లందరినీ నజీబ్​ పదవుల నుంచి తొలగించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే నజీబ్​ పదవిని కోల్పోయారు. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో 2020లో కోర్టు నజీబ్​ను దోషిగా తేల్చింది. హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది.