మహబూబ్నగర్, వెలుగు : పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు లాభాలు వస్తాయని ఆశపడి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 400 మంది సుమారు రూ.50 కోట్లు పోగొట్టుకున్నారు. క్యాటర్పిల్లర్ అనే యాప్లో డబ్బులు డిపాజిట్ చేయగా ఇప్పుడు అది మూతపడడంతో బోరుమంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.
అధిక మొత్తం ఆశచూపి..
కొందరు మోసగాళ్లు మూడేండ్ల కింద క్యాటర్పిల్లర్ (క్యాట్) యాప్ ప్రారంభించారు. ఈ యాప్ద్వారా డోజర్లు, హిటాచీలు, రోడ్ రోలర్లు అద్దెకు తీసుకొని పనులు చేస్తామని, ఇందుకు సహకారం కావాలని దసరా, దీపావళి సందర్భాల్లో పేద, మధ్య తరగతి, ఉద్యోగులు, చిరు వ్యాపారులను అట్రాక్ట్చేశారు. యాప్లో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి మూడింతల లాభం వస్తుందని బోల్తా కొట్టించారు. రూ.600 నుంచి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని, రూ.600 కడితే ప్రతి రోజూ రూ.18, రూ.వెయ్యికి రూ.32, రూ.12 వేలకు రూ.360, రూ.10 లక్షలకు రూ.30 వేలు ఇస్తామని నమ్మించారు. వేరేవాళ్లను చేర్పిస్తే ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేస్తామని నమ్మించారు. ఈ మాటలు నమ్మిన చాలామంది యాప్ నిర్వాహకులు పంపించిన లింక్ ల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ప్రతిరోజూ అందరికీ డబ్బులు అకౌంట్లలో జమ చేయడంతో నమ్మారు. ఈ విషయాన్ని బంధువులు, దోస్తులకు చెప్పి మరీ చేర్పించారు. కొందరు అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడి పెట్టేందుకు బంగారం, బైక్లు తాకట్టు పెట్టారు. ఇలా ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్ల వరకు పెట్టారు. ఈ నెల 8వ తేదీన యాప్ పని చేయడం మానేసింది. దీంతో సోమవారం వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన బాధితులు పాలమూరులోని టూ టౌన్ పోలీస్స్టేషన్కు వచ్చారు. అయితే, ఎక్కడి వారు అక్కడి పీఎస్లలోనే కంప్లయింట్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు టూటౌన్ పోలీస్ స్టేషన్లోనే 20 మంది ఫిర్యాదు చేశారు.
యాప్ సంస్థపై కేసు నమోదు చేశాం
క్యాటర్పిల్లర్అనేది ఆన్లైన్ రెంటల్ యాప్అని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 400 మంది వరకు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్చేసి మోసపోయినట్లుగా తెలుస్తోందని టూటౌన్ సీఐ ప్రవీణ్కుమార్ చెప్పారు. సురేందర్అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సురేందర్ రెండు నెలల కింద తన ఫ్రెండ్ పంపిన లింక్తో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడన్నారు. రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడన్నారు. ఈయనకు వచ్చిన లింక్ను ఫ్యామిలీ మెంబర్స్కు, ఫ్రెండ్స్కు పంపించాడన్నారు. లక్ష వరకు జరిగిన లావాదేవీలన్ని వేర్వేరు యూపీఐ ఐడీల ద్వారా జరిగాయని తెలిపారు. ఈ యాప్ సంస్థపై కేసులు పెట్టామని, ఎంత మొత్తం మోసం చేశారనేది విచారణలో తేలుతుందన్నారు.
