
- స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ లెక్కలు ఇవీ
- అయినా.. ఆత్మహత్యలే లేవంటున్న సీఎం కేసీఆర్
- రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో ప్లేస్.. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో వెల్లడి
- 2022లో వెయ్యి మందికిపైగా సూసైడ్ చేసుకున్నారన్న రైతు స్వరాజ్య వేదిక
- నిరుడు 23 వేల కుటుంబాలకు రైతు బీమా ఇచ్చినట్టు స్టేట్ స్టాటిస్టికల్ రిపోర్ట్.. అందులో రైతుల మరణానికి కారణాలు చెప్పని సర్కారు
- ఈ నెలలోనే 11 మంది రైతుల బలవన్మరణం
హైదరాబాద్, వెలుగు: అప్పుసప్పు చేసి ఎవుసం చేస్తే లాగోడి పైసలు కూడా ఎల్లక కొందరు.. చెడగొట్టు వానలకు నిండా మునిగి ఇంకొందరు.. మార్కెట్లో పంటకు సరైన రేటు రాక మరికొందరు.. ఇట్లా రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఓ చోట రైతులు ప్రాణాలు కోల్పోతున్నరు. బలవన్మరణాలకు పాల్పడుతున్నరు. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్బ్యూరో (ఎన్సీఆర్బీ) రిపోర్ట్ ప్రకారం.. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. 2022లో రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఇటీవల రైతు స్వరాజ్య వేదిక ప్రకటించింది. ఈ నెలలో ఇప్పటివరకు 11 మంది అన్నదాతలు సూసైడ్ చేసుకున్నరు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ‘‘రాష్ట్రంలో బిల్కుల్ రైతుల ఆత్మహత్యలే లేవు. తలెత్తుకొని తిరుగుతున్నరు. మేం ఎంతో ప్రయాసపడి, వాళ్లకు వెన్నంటి నిలిచి, కొన్ని ప్రయోజనాలు ఇచ్చి ఆత్మహత్యలు లేకుండా చేసినం” అని చెప్తున్నరు.
రైతు ఆత్మహత్యల వివరాల కోసం దాఖలైన ఆర్టీఐ అప్లికేషన్కు ఇటీవల రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి.. లెక్కలు వెల్లడించింది. 2014 నుంచి 2020 వరకు ఏ ఏ జిల్లాలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వివరించింది. ఏడేండ్లలో 6,121 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్టు అందులో తెలిపింది. 2015లో 1,400 మంది సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2015లో రాష్ట్రంలో 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో ఆత్మహత్యలు తగ్గినా.. ఆ తర్వాత వరుసగా రెండేండ్లు అంటే 2017, 2018లో మళ్లీ పెరిగాయి. 2014 నుంచి 2021 వరకు 5,956 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని పేర్కొంది.
రాష్ట్ర స్టాటిస్టికల్ రిపోర్ట్లో బీమా లెక్కలు చెప్పి..!
మూడు రోజుల క్రితం రాష్ట్ర సర్కారు విడుదల చేసిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో రైతుబీమాకు సంబంధించిన లెక్కలను వెల్లడించింది. 2018 నుంచి 2021 వరకు 88,620 క్లెయిములను సెటిల్ చేశామని, రూ.4,431 కోట్ల మొత్తాన్ని రైతుల కుటుంబాలకు అందించామని ప్రభుత్వం పేర్కొంది. 2020–2021 ఏడాదికి సంబంధించి 23,436 క్లెయిములను సెటిల్ చేయగా.. రూ.1,171.8 కోట్లు చెల్లించినట్టు తెలిపింది. 2022 నవంబర్ 11 నాటికి 3,583 క్లెయిములకు గానూ రూ.179.15 కోట్లు ఇచ్చినట్టు వివరించింది. అయితే, రైతులు ఏ కారణంతో చనిపోయారన్న విషయాన్ని మాత్రం ఆ స్టాటిస్టికల్ రిపోర్ట్లో పేర్కొనలేదు. ఏటా ఎంత మంది రైతులు చనిపోతున్నారన్న లెక్కలు తీస్తున్న సర్కారు.. మరణానికి కారణాలనూ వివరిస్తున్నది. కానీ, ఆత్మహత్యల లెక్కలను మాత్రం దాస్తున్నది. ఎవరికీ తెలియకుండా ‘అదర్స్’ అనే కేటగిరీలో పెడుతున్నదన్న విమర్శలు ఉన్నాయి.
24 గంటల కరెంట్ ఉట్టిమాటేనా..?
భూములు గుంజుకుంటున్నారని, ధరణిలో తప్పులున్నాయని, 24 గంటల కరెంటు రావట్లేదని, వడ్లు కొంటలేరని.. రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటల కరెంటు.. పది గంటలు కూడా ఇస్తలేరని, త్రీఫేజ్ కరెంట్ అర్ధరాత్రుళ్లు ఇస్తున్నారని రైతులు ధర్నాలకు దిగుతున్నారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని పథకాలను సర్కారు బంద్ పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. వరదలొస్తే పంట నష్టం అంచనాలనూ సర్కారు తీయడం లేదు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేదు.