- అక్టోబర్ 1 నుంచి కీ ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్ అమల్లోకి
- కస్టమర్ అనుమతి ఉంటేనే అదనపు చార్జీలు
- ఏయే చార్జీలు వసూలు చేస్తారో తెలియజేసే స్టేట్మెంట్ను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందే ఇష్యూ చేయాలి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మంజూరయ్యే లోన్లలో ఎటువంటి రహస్య చార్జీలు ఉండవు. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ఎబీఎఫ్సీలు), ఇతర రెగ్యులేటెడ్ సంస్థలు లోన్లు తీసుకునే తమ కస్టమర్లకు కీ ఫాక్ట్స్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ను ఇవ్వాలి. అంటే ఏయే చార్జీలు వేస్తారో ఈ స్టేట్మెంట్లో వివరంగా తెలియజేయాలి. అప్పు తీసుకునే ముందే ఈ స్టేట్మెంట్ను ఇవ్వాలి.
కేఎఫ్ఎస్లో పేర్కొన్న చార్జీలు మాత్రమే బారోవర్ల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్తగా మంజూరు చేసే రిటైల్ లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లకు సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కేఎఫ్ఎస్లను ఇష్యూ చేయాలని తాజాగా ఆర్బీఐ ఆదేశించింది. పాత కస్టమర్లకు మంజూరు చేసే లోన్లకు కూడా ఈ స్టేట్మెంట్ను ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ‘ కేఎఫ్ఎస్లో పేర్కొనని ఏ చార్జీలు, ఫీజులను కూడా లోన్ టెన్యూర్లో కస్టమర్ అనుమతి లేకుండా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వేయకూడదు’ అని ఆర్బీఐ తెలిపింది. ఈ గైడ్లైన్స్ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటే?
లోన్ అగ్రిమెంట్కు సంబంధించి కీలకమైన అంశాలు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో ఉంటాయి. అప్పు తీసుకోవడానికి ఎంత ఖర్చవుతుందో బారోవర్లకు ఈజీగా అర్థమవుతుంది. వడ్డీ రేటు, ఇన్సూరెన్స్ చార్జీలు, లీగల్ ఫీజులు, అదనపు చార్జీలు వంటివి కలుపుకొని లోన్కు అయ్యే ఖర్చును తెలియజేసే యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్) కేఎఫ్ఎస్లో ఉంటుంది. దీంతో లోన్పై ఏడాదికి అయ్యే ఖర్చుపై బారోవర్లకు క్లారిటీ వస్తుంది. కేఎఫ్ఎస్లో ఇంకా ఎంత అప్పు చెల్లించాలి? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు? వంటి వివరాలు కూడా ఉంటాయి. కేఎఫ్ఎస్లో ఈక్వేటెడ్ పీరియాడిక్ ఇన్స్టాల్మెంట్ (ఈపీఐ) వివరాలు పొందుపరిచి ఉంటాయి. ఈపీఐ అంటే బారోవర్ నెలకు లేదా ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వల్లో లోన్ తీర్చడానికి చేసే పేమెంట్ అని అర్థం. ప్రతీ నెల చేసే రీపేమెంట్స్ను ఈఎంఐగా పిలుస్తారు. ఈపీఐలో లోన్ అసలు, వడ్డీ కలిసి ఉం టాయి.
బారోవర్లకు లాభం..
ఒక సంస్థ దగ్గర అప్పు తీసుకుంటే ఎంత ఖర్చవుతుందో బారోవర్కు కేఎఫ్ఎస్ ద్వారా ఈజీగా అర్థమవుతుంది. దీంతో వేరు సంస్థలు ఆఫర్ చేసే లోన్లను పోల్చొచ్చు. లోన్ తీసుకునేటప్పుడే కేఎఫ్ఎస్ అందకపోతే ఈ సమస్యను రైజ్ చేయొచ్చు. ఈ సమస్యను ఇంటర్నల్గా సంస్థ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోయినా లేదా బారోవర్ అసంతృప్తిగా ఉన్నా బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వద్ద ఫిర్యాదు చేయొచ్చని ఆర్బీఐ తెలిపింది.
కేఎఫ్ఎస్ను ఎలా పొందాలంటే?
లోన్ రీపేమెంట్ చేసే ప్రతీ సారి కేఎఫ్ఎస్ను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. అలానే టెర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏవైనా మార్పులు చేస్తే ఈ స్టేట్మెంట్ను బారోవర్లకు అందించాలి. ఇందులోని భాష బారోవర్కు అర్థమయ్యేలా ఉండాలి. అలానే కేఎఫ్ఎస్లోని వివరాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు బారోవర్లకు అర్థమయ్యేలా వివరించాలి.
ఏడు లేదా అంతకంటే ఎక్కువ రోజుల టెన్యూర్ ఉన్న లోన్లు తీసుకునేవారు కేఎఫ్ఎస్పై మూడు వర్కింగ్ డేస్లో తమ సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ వాలిడిటీ పోతుంది. ఏడు రోజుల కంటే తక్కువ టెన్యూర్ ఉన్న లోన్లు తీసుకునేవారు ఒక వర్కింగ్ డేలోనే కేఎఫ్ఎస్పై తమ సమాధానం ఇవ్వాలి. బారోవర్ అంగీకరిస్తే వ్యాలిడిటీ పీరియడ్లో కేఎఫ్ఎస్లో పేర్కొన్న రూల్స్కు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కట్టుబడి ఉండాలి.