వచ్చే ఏడాది భారత్​లో జరగనున్న జి–20 సదస్సు

వచ్చే ఏడాది భారత్​లో జరగనున్న జి–20 సదస్సు

అత్యంత శక్తిమంతమైన 17వ జి–20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈ సమావేశాలు వచ్చే ఏడాది భారత్​లో జరగనున్నాయి. పోటీ పరీక్షల దృష్ట్యా అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా జి–20 సదస్సుపై ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో జి–20 ఏర్పాటు, సభ్యదేశాలు, లక్ష్యాల గురించి తెలుసుకుందాం.  

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జి20 సదస్సు.  ఇది అంతర్జాతీయ సంస్థల్లో అత్యంత శక్తిమంతమైంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు, ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాను జి–20 కలిగి ఉంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం జి–20 వేదికపైన కనిపిస్తాయి. 

అధిక జనాభా కలిగి ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల కూటమినే గ్రూప్​ ఆఫ్​ 20 లేదా జి20 అంటారు.1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం చాలా దేశాలపై ప్రభావం చూపడంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూప్​ ఏర్పాటు చేయాలని భావించాయి. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్న ఆర్థిక  వ్యవస్థలతో కూడిన గ్రూప్​ ఆఫ్​ ఎయిట్​(జి–8) బృందాన్ని విస్తరించి చైనా బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చేర్చారు. సభ్య దేశాలు 19, యూరోపియన్​ యూనియన్​తో కలిపి జి20గా పేర్కొంటారు. మొదటిసారి 1999లో బెర్లిన్​లో సమావేశమయ్యారు. మొదట్లో జి–20 సదస్సుకు ప్రధానంగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్​ బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. బ్యాంకులు కుప్పకూలడం, నిరుద్యోగం పెరగడం, వేతనాల్లో మాంద్యం నెలకొనడంతో జి20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారింది. జి–20 ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి సభ్య దేశాల్లో సమావేశం అవుతున్నారు. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్​ డి.సి.లో జరిగింది. వాస్తవానికి జి20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జి20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఈ గ్రూపులో ఓటింగ్​ నిర్వహించి ఎంపిక చేస్తారు. 2022లో భారత్​లో జి–20 సదస్సు జరగనుంది. 

జి–20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండుసార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సంస్థలు వరల్డ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌‌‌‌వో, ఐఎంఎఫ్‌‌‌‌, డబ్ల్యూటీవో, ఫైనాన్షియల్‌‌‌‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లు ​ పాల్గొంటాయి. జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్​ బ్యాంక్​ గవర్నర్ల మొదటి పర్సనల్​ ప్యానల్​ సమావేశం ఇండోనేషియా నేతృత్వంలో 2022, ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 17న భారత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్​ ప్రసంగించారు.  

సదస్సు     సంవత్సరం      ప్రదేశం 
1     1999     బెర్లిన్​(జర్మనీ)
14      2019     ఒసాకా (జపాన్) 
15     2020     సౌదీ అరేబియా
16     2021     రోమ్​ (ఇటలీ) 
17     2022     బాలీ (ఇండోనేషియా)
18     2023     న్యూఢిల్లీ (ఇండియా​) 
19     2024     బ్రెజిల్​
 20     2025     సౌతాఫ్రికా

డ్రాప్ట్​ స్టేట్​మెంట్​ 

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జి–20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై సదస్సులో చర్చించారు. ఉక్రెయిన్​ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలన్న డిమాండ్​ను ప్రస్తావించారు. జి–20 సదస్సుకు రష్యా తరఫున విదేశాంగ మంత్రి లావ్​రోవ్​ హాజరయ్యారు. 

18వ జి20 సదస్సు 

వచ్చే ఏడాది జి20 సదస్సు న్యూఢిల్లీలో జరగనుంది. దీని థీమ్​ వన్​ ఎర్త్​, వన్​ ఫ్యామిలీ, వన్​ ప్యూచర్​. ఈ సదస్సు లోగోను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

బాలీ సదస్సు 

నవంబర్​ 15 నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది.  మోటో: రికవర్​ టుగెదర్​, రికవర్​ స్ట్రాంగర్​. ఆహ్వానిత దేశాలు కొలంబియా, ఫిజి, నెదర్లాండ్స్​, రువాండ, సెహగల్​, సింగపూర్​, స్పెయిన్​, ఉక్రెయిన్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​, సురినామ్​. అతిథ్య అంతర్జాతీయ సంస్థలు: ఫిఫా, వరల్డ్​ బ్యాంక్​, యునైటెడ్​ నేషన్స్​, ఐఎంఎఫ్​, డబ్ల్యూటీఓ, ఐఓసీ, డబ్ల్యూహెచ్​ఓ, వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం, ఇస్లామిక్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​, ఏసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​. ముగింపు కార్యక్రమంలో కూటమి బాధ్యతలను ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో లాంఛనంగా అప్పగించారు. ఈ బాధ్యతను డిసెంబర్​ 1 నుంచి భారత్​ స్వీకరించనుంది.

డిక్లరేషన్​

శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జి–20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్​లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. ఈ యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని డిక్లరేషన్​ పేర్కొంది. ఘర్షణల శాంతియుత పరిష్కారం, సంక్షోభ నివారణకు కృషి, చర్చలు ఇప్పుడు కీలకం. ఇది యుద్ధాలు చేసుకొనే శకం కాదని సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదానికి నిధులందించే కార్యకలాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్​ను నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయుక్తంగా ప్రకటించారు. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం చర్చించింది.

లక్ష్యాలు

1. సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారాలను పెంపొందించడం

2. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం

3. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం 

సభ్యదేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్​, దక్షిణ కొరియా, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, గ్రేట్​ బ్రిటన్​, అమెరికా, యూరోపియన్​ యూనియన్​. 2008 నుంచి స్పెయిన్‌‌‌‌ శాశ్వత ఆహ్వానిత దేశం.  జీ20లో పాకిస్థాన్‌‌‌‌ లేదు