
తిరువనంతపురం: సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) కు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్పై పోరాటం చేస్తున్న పినరయి విజయన్ ఆధ్వర్యంలోని కేరళ సర్కార్ మరో కొత్త వివాదానికి తెరతీసింది. గాంధీజీని గాడ్సే హత్య చేసిన ఘటన తాలూకు పెయింటింగ్ను బడ్జెట్ ప్రతులకు కవర్ పేజీగా ఉంచింది. రక్తపు మడుగులో పడి ఉన్న గాంధీజీ చుట్టూ జనాలు ఉన్న పెయింటింగ్ను మలయాళం ఆర్టిస్ట్ వేశారు. “ గాంధీజీ హత్యకు గురయ్యారనే విషయాన్ని మేం గుర్తు పెట్టుకుంటాం. అధికార బీజేపీ వెనుకేసుకొస్తున్న హిందూ కమ్యూనలిస్టు అని కూడా గుర్తుంచుకుంటాం” అని ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఐజాక్ చెప్పారు. సీఏఏను విమర్శిస్తూ బడ్జెట్ స్పీచ్ మొదలు పెట్టిన థామస్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.