ఎలక్ట్రిక్ వెహికల్స్ కు.. హైదరాబాద్ బూస్టింగ్

ఎలక్ట్రిక్ వెహికల్స్ కు.. హైదరాబాద్ బూస్టింగ్
  •      సిటీలోని రోడ్ల వెంట చార్జింగ్​ స్టేషన్లు ఏర్పాటు
  •      ఇందుకోసం టీఎస్ ఆర్ఈడీసీఓతో ఒప్పందం
  •      దశలవారీగా 230 చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయం
  •      ఇప్పటికే 46 లొకేషన్లలో ఏర్పాటు..
  •      హెచ్ఎండీఏ పరిధిలో మరో 100 ఏర్పాటుకు ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో ఎలక్ట్రిక్​వెహికల్స్ ను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. సౌండ్, ఎయిర్​పొల్యూషన్​తగ్గించేందుకు కృషి చేస్తోంది. సిటీ రోడ్ల వెంట ఈ–వెహికల్స్ చార్జింగ్​స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అయిన టీఎస్ ఆర్ఈడీసీఓ(తెలంగాణ స్టేట్​రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్​మెంట్​కార్పొరేషన్​లిమిటెడ్​తో ఒప్పందం చేసుకుంది. వెహికల్స్​మూవ్​మెంట్​ఎక్కువగా ఉండే రోడ్లను బల్దియా అధికారులు గుర్తించారు. ఆయా రూట్లలో మొత్తం 230 చార్జింగ్​స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 బల్దియాతోపాటు హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో 100 లొకేషన్లలో ఈవీ చార్జింగ్​స్టేషన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ప్రస్తుతం బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో స్టేషన్​లో ఫాస్ట్ స్పీడ్ తోపాటు, స్లో స్పీడ్​చార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన చోట్ల ఫీజిబిలిటీని బట్టి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో ఇప్పటికే 46 లొకేషన్లలో చార్జింగ్​స్టేషన్లు ఏర్పాటు చేశారు. మిగతాచోట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి వెహికల్స్​చార్జింగ్​కు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక చార్జీలు ఫిక్స్​చేస్తారని తెలుస్తోంది. 

సిటీలో 80 వేల ఈవీలు

ప్రస్తుతం సిటీలో 80 వేలకిపైగా ఎలక్ట్రిక్​వెహికల్స్ ఉన్నాయి. కొత్తగా ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా చార్జింగ్​గురించే ఆలోచిస్తున్నారు. ఎక్కడెక్కడ చార్జింగ్​పాయింట్లు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే జనాల్లో ఈవీల వినియోగం, ఉపయోగాలపై అవగాహన పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్​రేట్లు పెరిగిపోతుండడంతో ఈవీల వైపు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో వినయోగం మరింత పెరిగే అవకాశం ఉంది. 

మొన్నటిదాకా సీఎన్​జీ వెహికల్స్​కొనేందుకు చాలా మంది ముందుకొచ్చారు. అయితే ప్రస్తుతం సీఎన్​జీ రేటు పెట్రోలు, డీజిల్​మాదిరిగా రూ.90 దాటడంతో ఈవీల వైపు మళ్లుతున్నారు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగేటోళ్లు ఎలక్ట్రిక్​వెహికల్స్ వాడుతున్నారు. సిటీలో చార్జింగ్ సెంటర్ల సంఖ్య పెరిగితే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్​కొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 2030 నాటికి ఎలక్ట్రిక్​వెహికల్స్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక పాలసీ రూపొందించింది.

మొత్తం 330 చార్జింగ్ స్టేషన్లు

జీహెచ్ఎంసీ పరిధిలో 230, హెచ్ఎండీఏ పరిధిలో 100 చార్జింగ్​స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఈ– వెహికల్స్​సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ, టీఎస్ ఆర్ఈడీసీఓ సంయుక్తంగా దశలవారీగా ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టేషన్లలో ఫాస్ట్ చార్జింగ్ డీసీ-001(15కేవీ) కెపాసిటీతో ఒక గన్​చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 122-150 కేడబ్ల్యూ చార్జింగ్​సామర్థ్యంతో టీఎస్​ఆర్ఈడీసీఓ 2 రెండు చొప్పున ఏర్పాటు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత మిగిలిన చోట్ల చార్జింగ్​స్టేషన్ల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ, టీఎస్​ఆర్ఈడీసీఓ నిర్ణయం తీసుకోనున్నాయి.