- ఇంకో నెల టైమ్ ఇవ్వండి
- టీ20 వరల్డ్కప్ నిర్వహణపై ఐసీసీ కోరనున్న బీసీసీఐ
దుబాయ్: ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్కప్ నిర్వహణపై తుది నిర్ణయానికి వచ్చేందుకు బీసీసీఐ మరో నెల రోజుల సమయం తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం వర్చువల్గా జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్లో ఇంటర్నేషనల్ బాడీని కోరనుంది. అదే సమయంలో ఇండియాలో ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ (ఎఫ్టీపీ) సైకిల్తో పాటు మరికొన్ని అంశాలపై ఐసీసీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఐసీసీ మీటింగ్కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నేరుగా హాజరుకావాలని నిర్ణయించినా... వర్చువల్గానే అటెండ్ అవుతున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఐపీఎల్ నిర్వహణ గురించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చించేందుకు దుబాయ్ బయల్దేరుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఐసీసీ మీటింగ్లో టీ20 వరల్డ్కప్పై ఇప్పుడే స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం లేదు. అలాగే, జులై 1 తర్వాత బీసీసీఐ మరో ఎస్జీఎమ్ను నిర్వహించనుంది. కాబట్టి జులై 18న మొదలయ్యే తమ యాన్యువల్ కాన్ఫరెన్స్ సందర్భగానే మెగా టోర్నీపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో టీ20 వరల్డ్కప్నకు యూఏఈని ఐసీసీ బ్యాకప్ వెన్యుగా ఎంచుకుంది అయితే ఇప్పటికే ఐపీఎల్ ఫేజ్–2 నుంచి సెప్టెంబర్ 15- అక్టోబర్ 15 మధ్య యూఏఈలో ఆర్గనైజ్ చేయాలని డిసైడైన బీసీసీఐ.. టీ20 మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని భావిస్తోంది.
‘ఇండియాలో కరోనా క్రమంగా కంట్రోల్కి వస్తోంది. అయితే టీ20 వరల్డ్కప్ నిర్వహించేందుకు ఇప్పుడే కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గంగూలీ, జై షా నెల రోజుల గడువు అడగడం సరైన నిర్ణయం. ఇండియాలో టోర్నీని నిర్వహించడం సరైనదో కాదో అనే దానిపై వాళ్లు ప్రభుత్వం నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు. అదే సమయంలో కరోనా కేసులు మళ్లీ ఎప్పుడు పెరుగుతాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ, ఐపీఎల్ టైమ్లో సడెన్గా కేసులు పెరగడం చూశాం. అందువల్ల ప్రమాదం ఇంకా తొలగిపోలేదనే చెప్పాలి. కాబట్టి అక్టోబర్-, నవంబర్లో బీసీసీఐ ఈ టోర్నీని నిర్వహించేందుకు ప్రస్తుతానికి 50,-50 చాన్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అప్పుడు కూడా తొమ్మిది సిటీల్లో నిర్వహించే అవకాశమైతే ఉండబోదు. మూడు స్టేడియాలు అందుబాటులో ఉన్న ముంబై, పుణెను ఆతిథ్య సిటీలు ఎంపిక చేయొచ్చు. అహ్మదాబాద్ ఫైనల్ వెన్యూగా ఉంటుంది. దీని వల్ల ట్రావెలింగ్ను తగ్గించొచ్చు. అదే టైమ్లో పాకిస్తాన్ టీమ్ మహారాష్ట్ర, గుజరాత్లో ఆడలాంటే మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని బోర్డు వర్గాలు చెప్పాయి. మరోవైపు ఇండియాలో గ్లోబల్ ఈవెంట్లకు ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు విషయం బీసీసీఐకి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నా సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఇప్పించకపోతే ఐసీసీ రెవెన్యూ వాటాలో బీసీసీఐ సుమారు రూ. 905 కోట్లు నష్టపోనుంది.
2023-31 ఎఫ్టీపీ సైకిల్, డబ్ల్యూటీసీపై చర్చ
2023 -నుంచి 2031 మధ్య వచ్చే ఎనిమిది సంవత్సరాల ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)తో పాటు ఐసీసీ ప్రధాన ఈవెంట్లు, బైలేటరల్ సిరీస్ల నిబంధనలపై కూడా ఐసీసీ బోర్డు మీటింగ్లో చర్చ జరగనుంది. అలాగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) భవితవ్యం కూడా మీటింగ్లో చర్చకు రానుంది.
విమెన్ క్రికెట్పై ప్రత్యేక దృష్టి
విమెన్స్ క్రికెట్పై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రణాళికపై ఐసీసీ చర్చించనుంది. 2022 కామన్వెల్త్ గేమ్స్ విమెన్స్ క్రికెట్ ఈవెంట్లో ఇండియా పార్టిసిపేషన్తో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం తెలపడంతో ఈ విషయంలో ఐసీసీకి ప్రోత్సాహం లభించింది. 104 దేశాల్లో ఈ గేమ్ను సమానంగా విస్తరించాలని ఐసీసీ బోర్డు కోరుకుంటోంది. విమెన్స్ క్రికెట్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి టీ20 ఫార్మాట్ ఒక సాధనంగా పనికొస్తుందని అనుకుంటోంది.