మా గోల్డ్ మాకిప్పించండి.. చెన్నూరు ఎస్‌‌బీఐ ఎదుట బాధితుల ఆందోళన

మా గోల్డ్ మాకిప్పించండి.. చెన్నూరు ఎస్‌‌బీఐ ఎదుట బాధితుల ఆందోళన

చెన్నూరు, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌‌బీఐ ఎదుట సోమవారం గోల్డ్‌‌ లోన్‌‌ కస్టమర్లు ఆందోళనకు దిగారు. బ్యాంక్‌‌లో తాకట్టు పెట్టిన 20 కిలోల గోల్డ్‌‌తో క్యాషియర్‌‌ రవీందర్‌‌ పరార్‌‌ కావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. తమ గోల్డ్‌‌ ఉందో ? పోయిందో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. రవీందర్‌‌ ఎత్తుకెళ్లిన గోల్డ్‌‌ను రికవరీ చేయలేకపోతే ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు చెల్లించాలని పట్టుబడ్డారు. గోల్డ్‌‌ ఎత్తుకెళ్లిన క్యాషియర్‌‌ రవీందర్‌‌, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్,సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో బ్యాంక్‌‌ ఆఫీసర్లకు కస్టమర్లతో మాట్లాడారు. 

క్యాషియర్‌‌ రవీందర్‌‌ ఆచూకీ ఇంకా దొరకలేదని, అతడిని పట్టుకోగానే గోల్డ్, క్యాష్‌‌ రికవరీ చేసి.. ఎంత గోల్డ్‌‌ పోయిందా నిర్ధారించిన తర్వాత బ్యాంక్‌‌ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరు ఆందోళన చెందకుండా ఆఫీసర్లకు సహకరించాలని కోరారు. పోయిన గోల్డ్‌‌కు ప్రస్తుత రేటు కట్టిస్తామని, అప్పటివరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని రీజినల్‌‌ మేనేజర్‌‌ రితేశ్‌‌ కుమార్‌‌ గుప్తా చెప్పడంతో ఆందోళన విరమించారు.