
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరుగుతున్న మాన్సూన్ రెగట్టా నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్ షిప్ లో ఏకలవ్య బాతం అండర్15 ఆప్టిమిస్టిక్ బాయ్స్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. టోర్నీలో స్టార్టింగ్ నుంచి సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న మధ్యప్రదేశ్ ఎన్ఎస్ఎస్కు చెందిన ఏకలవ్య శనివారం జరిగిన 10, 11వ రేసుల్లోనూ సత్తా చాటాడు. దాంతో, చివరి రౌండ్ రేసు మిగిలుండగానే 15 పాయింట్లతో మాన్సూన్ రెగట్టా ట్రోఫీతో పాటు ఎస్ హెచ్ బాబు మెమోరియల్ ట్రోఫీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక, అండర్15 గర్ల్స్ ఆప్టిమిస్టిక్ లో తెలంగాణ సెయిలర్ కొమరవెల్లి దీక్షిత 10,11వ రేసుల్లో కాస్త తడబడింది. అయినా 52 పాయింట్లతో ఆమె టాప్ ప్లేస్లో నిలవగా, మధ్యప్రదేశ్ సెయిలర్ షాగున్ ఝా (55) గోల్డ్ మెడల్ రేసులోకి వచ్చింది. అండర్ 19 మిక్స్ డ్ ఇంటర్నేషనల్ క్లాస్ కేటగిరీలో తెలంగాణ జంట లావేటి ధరణి –వడ్ల మల్లేష్ పదో రౌండ్లో డిస్క్వాలిఫై అయింది. ప్రస్తుతం 16 పాయింట్లతో టాప్ ప్లేస్లో గోల్డ్ రేసులోనే ఉంది.