- కరోనా రిస్ట్రిక్షన్లు, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, పడుతున్న రూపాయే కారణం
- ఈ ఏడాది ఆల్టైమ్ హై నుంచి రూ. 9 వేలు పడిన 10 గ్రాముల గోల్డ్
బిజినెస్ డెస్క్, వెలుగు: ఈ ఏడాది నేల చూపులు చూసిన బంగారం రేట్లు, కొత్త ఏడాదిలో పెరుగుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కరోనా భయాలు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం, డాలర్ మారకం రూపాయి పడుతుండడం వంటి కారణాలతో దేశంలో 10 గ్రాముల బంగారం రేటు రూ. 55 వేల మార్క్ను టచ్ చేస్తుందని చెబుతున్నారు. కరోనా సంక్షోభం వలన కిందటేడాది గోల్డ్ రేట్లు రికార్డ్ లెవెల్స్ను చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం (ఫ్యూచర్ మార్కెట్) కిందటేడాది ఆగస్ట్లో రూ. 56,200 వద్ద ఆల్టైమ్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాములు) రేటు రూ. 48 వేల స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆల్టైమ్ హై నుంచి గోల్డ్ రేట్లు రూ. 9 వేలు తగ్గాయి. గత ఆరేళ్లలో ఇంతలా ఎప్పుడూ తగ్గలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్(స్పాట్) లో కిందటేడాది ఆగస్ట్లో రూ. 58 వేల స్థాయి వరకు వెళ్లిన 10 గ్రాముల గోల్డ్ రేటు, ప్రస్తుతం రూ. 49,330 వద్ద పలుకుతోంది. ప్రస్తుతం గోల్డ్ రేటు ఆల్టైమ్ హై నుంచి 14 శాతం తక్కువతో ట్రేడవుతోందని, ఈ ఏడాది జనవరి లెవెల్తో పోలిస్తే 4 శాతం తక్కువ రేటు పలుకుతోందని ఎనలిస్టులు అన్నారు. ఈ ఏడాది బంగారం కంటే షేర్లలో డబ్బులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, అందుకే గోల్డ్ రేట్లు తగ్గాయని కమ్ట్రెండ్జ్ ఫౌండర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అన్నారు. మరోవైపు కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో యూఎస్, యూరప్ దేశాల్లో న్యూఇయర్ టైమ్లో రిస్ట్రిక్షన్లు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. దీనికి తోడు యూరో, యెన్, రూపాయి వంటి కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోందని, యూఎస్ ఫెడ్ పాలసీని కఠినం చేస్తే డాలర్ లాభపడుతుందని చెప్పారు. కరోనా రిస్ట్రిక్షన్లు పెరిగినా, డాలర్ బలపడి రూపాయి వాల్యూ తగ్గినా దేశంలో గోల్డ్ ధరలు పెరుగుతాయి. మీడియం టెర్మ్లో గోల్డ్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
కొత్త ఏడాది చివరి ఆరునెలల్లో..
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు (28.35 గ్రాములు) గోల్డ్ రేటు 1,791 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. దేశంలోని ఎంసీఎక్స్ ఎక్స్చేంజిలో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ (డిసెంబర్) రేటు రూ. 47,740 గా ఉంది. స్టాక్ మార్కెట్లు పడితే గోల్డ్ పెరుగుతుందని, అదే గ్లోబల్గా పొలిటికల్ గొడవలు చెలరేగితే గోల్డ్కు మరింత బలం చేకూరుతుందని త్యాగరాజన్ పేర్కొన్నారు. ‘2022 మొదటి ఆరు నెలల్లో ఔన్సు గోల్డ్ రేటు గ్లోబల్గా 1,700–1,900 డాలర్ల మధ్య ట్రేడవుతుందని, చివరి ఆరు నెలల్లో 2 వేల డాలర్లను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. అదే దేశీయ మార్కెట్లో అయితే గోల్డ్ ఫ్యూచర్స్ రేటు ఎంసీఎక్స్లో మొదటి ఆరు నెలల్లో రూ.45,000– 50,000 మధ్య, చివరి ఆరు నెలల్లో రూ. 55 వేలను క్రాస్ చేస్తుందని అంచనావేస్తున్నాం’ అని త్యాగరాజన్ చెప్పారు. యూఎస్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం, బాండ్ ఈల్డ్లకు సంబంధించిన అంశాలు గోల్డ్ రేట్లు పెరగడానికి సాయపడతాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు. గ్లోబల్గా చూస్తే ఔన్సు గోల్డ్ రేటుకి 1,833–1,870 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఉందని, రేట్లు పడితే 1,670 డాలర్ల వద్ద సపోర్ట్ ఉందని చెప్పారు. లాంగ్టెర్మ్లో ఔన్సు గోల్డ్ రేటు 1,970 డాలర్ల వరకు పెరగొచ్చని అన్నారు. ‘దేశ ఎంసీఎక్స్ మార్కెట్లో షార్ట్టెర్మ్లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 49,200 వరకు పెరగొచ్చు. కిందకి పడితే రూ. 45,000 వద్ద సపోర్ట్ ఉంది. మొత్తం ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే రూ. 51,800 వరకు పెరగొచ్చు. పడితే రూ. 42,500 వద్ద సపోర్ట్ దొరుకుతుంది’ అని తపన్ పటేల్ అంచనావేశారు. మరోవైపు ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజిలో రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ను తీసుకురావడం, దేశీయంగా ‘ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్’ లను ఎక్స్చేంజీలు అమ్మనుండడంతో రానున్న మరికొన్నేళ్లలో గోల్డ్ రూపురేఖలు మారతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ (ఇండియా) సీఈఓ సోమసుందరమ్ అభిప్రాయపడ్డారు. కానీ, గోల్డ్ హాల్మార్కింగ్ తప్పనిసరి చేయడం వలన గోల్డ్ కొనుగోళ్లు తగ్గొచ్చని చెప్పారు. ప్రభుత్వం హాల్మార్కింగ్ రూల్స్ను దేశమంతటా సక్సెస్ఫుల్గా అమలుచేస్తుందని అన్నారు. ‘ పెరుగుతున్న కమోడిటీల రేట్లు, లాజిస్టిక్ కాస్ట్ రానున్న మరికొన్ని నెలల్లో ఆర్బీఐపై మరింత ఒత్తిడి పెంచుతాయి. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ఆర్బీఐ ఉంది’ అని చెప్పారు. ఇన్ఫ్లేషన్ హెడ్జ్గా గోల్డ్ ఉంటుందని, దీంతో గోల్డ్కు డిమాండ్ పెరుగుతుందని సోమసుందరమ్ పేర్కొన్నారు.