గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్పై జీఓఎం కీలక నిర్ణయం

 గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్పై జీఓఎం కీలక నిర్ణయం
  • గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్​ నుంచి వేరు చేసిన జీఓఎం

వెలుగు బిజినెస్​ డెస్క్:​ గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్​ల తరహాలో కాకుండా వేరుగా ఆన్​లైన్​ గేమింగ్​పై ట్యాక్స్​ వేయాలని గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్ (జీఓఎం)​ నిర్ణయించింది. జీఓఎం నిర్ణయంపై ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. ఆన్​లైన్​ గేమ్స్​పై పన్నును 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని జీఎస్​టీ కౌన్సిల్​ ఈ ఏడాది జులైలో ప్రతిపాదించింది. ప్రస్తుతం గ్రాస్​ గేమింగ్​ రెవెన్యూపై 18 శాతం జీఎస్​టీ విధిస్తున్నారు. అయితే గ్రాస్​ గేమింగ్​ వాల్యూపై ట్యాక్స్​ వేయాలనేది జీఓఎం ప్రపోజల్​. అంటే, ప్లేయర్లు స్టేక్​గా పెట్టే మొత్తం మీద ట్యాక్స్​ విధిస్తారు. ఇందు వల్ల రెవెన్యూ ఎక్కువగా కనబడుతుంది.ఆన్​లైన్​ గేమింగ్​లో ప్లేయర్లందరూ కలిసి ప్రైజ్​ మనీ పూల్​ క్రియేట్​ చేస్తారు.

ఆ తర్వాత గెలుపొందిన వాళ్లకి ఈ పూల్​ నుంచి చెల్లిస్తారు. పూల్​ మొత్తానికి గెలుపొందిన వాళ్లకి చెల్లించే మొత్తానికి మధ్య వ్యత్యాసాన్నే గ్రాస్​ గేమింగ్​ రెవెన్యూ అంటారు.  గ్రాస్​ గేమింగ్​ వాల్యూపై 28 శాతం పన్ను విధించడమంటే ఇప్పుడున్న దానికంటే రెట్టింపవుతుందనే ఆందోళనను ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీ వ్యక్తం చేసింది. అలా చేస్తే చాలా  కంపెనీలు మూతపడతాయని కూడా ఇండస్ట్రీ పేర్కొంది. 

5 బిలియన్​ డాలర్లకు 
చేరనున్న ఆన్​లైన్​ గేమింగ్​....

మన దేశంలో ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీ 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. బీసీజీ, సెకోవియా ఇండియాలు తమ రిపోర్టులో ఈ అంచనా వేశాయి. డ్రీమ్​ స్పోర్ట్స్​, మొబైల్​ ప్రీమియర్​ లీగ్ వంటి యూనికార్న్​ కంపెనీలు ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాయి. కానీ, ఈ ఇండస్ట్రీ ఇంకా ఎదిగే దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. 

హర్షం ప్రకటిస్తున్న ఇండస్ట్రీ... 

ఆన్​లైన్​ గేమింగ్​ను వేరుగా చూడాలనే నిర్ణయానికి జీఓఎం రావడం సంతోషకరమని ఆల్​ ఇండియా గేమింగ్​ ఫెడరేషన్​ (ఏఐజీఎఫ్​) చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ రోలాండ్​ ల్యాండర్స్​ చెప్పారు. ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీ స్థితిగతులను పరిశీలించి, సరయిన పన్ను రేటును నిర్ణయిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్​ల నుంచి వేరుగా చూడాలనే జీఓఎం నిర్ణయం సరైనదని గేమింగ్​ మార్కెటింగ్​ కంపెనీ ఫౌండర్​ రోహిత్​ అగర్వాల్ పేర్కొన్నారు.

ఆయా రంగాల పరిస్థితులు ఒకేలాంటివి కాదని వివరించారు.  ఆపరేటింగ్​ ప్రొసీజర్​లు, ప్రాఫిట్​ మార్జిన్లు కూడా ఒకేలా ఉండవని చెప్పారు. ప్రమాణాల ప్రకారం  ట్యాక్స్​ విధించడమే సమంజసమని అన్నారు. మూడు రంగాలపైనా 28 శాతం జీఎస్​టీ వేయాలని జీఓఎం గతంలో రికమెండ్​ చేసింది. దీనిపై ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీ తీవ్ర అభ్యంతరం ప్రకటించింది. ఫ్యాంటసీ స్పోర్ట్స్​, రమ్మీ వంటి వాటిని స్కిల్​ గేమ్స్​గా గుర్తిస్తూ కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా  ఇండస్ట్రీ ప్రస్తావించింది. 

త్వరలో జీఓఎం ఫైనల్​ రిపోర్టు

గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్​, ఆన్​లైన్​ గేమింగ్​పై ట్యాక్స్​ పెంచాలనే జీఎస్​టీ కౌన్సిల్​ ప్రపోజల్​ను పరిశీలించడానికి గ్రూప్​ ఆఫ్ మినిస్టర్స్​ (జీఓఎం) ఏర్పాటు చేశారు. ఆన్​లైన్​ గేమింగ్​ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చలు జరపాలని, ఆ తర్వాతే జీఎస్​టీ రేట్లను ఖరారు చేయాలని ఈ నెల 5 న జరిగిన మీటింగ్​లో జీఓఎం డిసైడ్​ చేసింది. అంతేకాదు, ఫైనల్​ రిపోర్టు ఇచ్చే ముందు లీగల్​ ఒపీనియన్​ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. గుర్రప్పందాలు, గ్యాంబ్లింగ్​లతో ఆన్​లైన్​ గేమింగ్​ను కలిపి చూడకూడదనే నిర్ణయానికి కూడా జీఓఎం వచ్చింది.