10% వాటా కొనాలని ప్లాన్స్
ఇండియాలో మరో డీల్ కోసం చూస్తున్న సెర్చింజన్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్లో ఇన్వెస్ట్ చేసేందుకు సెర్చింజన్ గూగుల్ రెడీ అవుతోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. 150 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుందని, దీంతో పాలసీ బజార్లో10శాతం వాటాను దక్కించుకోనుందని అన్నారు. మరోవైపు సాఫ్ట్ బ్యాంక్ కు పాలసీ బజార్లో 15 శాతం వాటా ఉంది. ఈ వాటాను ఈ కంపెనీ తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఇండియన్ డిజిటల్ మార్కెట్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని గూగుల్ చూస్తోందని, దీనిలో భాగంగానే పాలసీ బజార్లో మైనార్టీ వాటాను కొనాలనుకుంటోందని అన్నారు.
చివరి సారిగా పాలసీ బజార్ ఇన్వెస్ట్ రౌండ్ను బట్టి కంపెనీ వాల్యుయేషన్ నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, ఈ అంశంపై సాఫ్ట్ బ్యాంక్, గూగుల్ రెస్పాండ్ కాలేదు. పాలసీ బజార్ కామెంట్ చేయడానికి నిరాకరించింది. ఇండియాలో వచ్చే ఏడేళ్లలో్ 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని గూగుల్ ప్లాన్స్ వేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 4.5బిలియన్ డాలర్లను రిలయన్స్ జియోలో పెట్టుబడిగా పెట్టింది. మరో నాలుగైదు డీల్స్ కోసం గూగుల్ చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.

