గూగుల్​తో సర్కార్​ దోస్తీ

గూగుల్​తో సర్కార్​ దోస్తీ

న్యూఢిల్లీ: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. టెక్ దిగ్గజం గూగుల్‌‌తో జత కట్టింది. ‘బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా’ ప్రొగ్రామ్‌‌ను లాంచ్ చేయడమే లక్ష్యంగా ఈ రెండు చేతులు కలిపాయి. పలు కీలక సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీ ఆధారిత సొల్యుషన్స్‌‌ను అభివృద్ధి చేయడానికి ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఈ ప్రొగ్రామ్ ఒక ప్లాట్‌‌ఫామ్‌‌ను అందిస్తుంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, స్మార్ట్ సిటీలు, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, ఉమెన్ సేఫ్టీ, స్మార్ట్ మొబిలిటీ, ట్రాన్స్‌‌పోర్టేషన్, డిజిటల్ లిటరసీ వంటి ఏరియాలపైనే ఈ ప్రొగ్రామ్ ఫోకస్ చేయనుంది. స్టూడెంట్ల నుంచి ఐడియాలను సేకరించనుంది. ఈ ప్రొగ్రామ్‌‌లో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వారి అద్భుతమైన ఐడియాలను, రియల్ వరల్డ్ సొల్యుషన్స్‌‌గా మార్చేందుకు ఈ ప్రొగ్రామ్ సహకరించనుంది. మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, ఆండ్రాయిడ్ వంటి టెక్నాలజీలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గూగుల్ డెవలపర్ స్టూడెంట్ క్లబ్ నెట్‌‌వర్క్, ఇతర గూగుల్ డెవలపర్‌‌‌‌ నెట్‌‌వర్క్​ ద్వారా వీటిని ఆఫర్ చేయనుంది. ప్రొడక్ట్‌‌ డిజైన్, స్ట్రాటజీ, టెక్నాలజీల్లో కూడా గూగుల్ మెంటర్‌‌‌‌షిప్ సెషన్లను ఆఫర్ చేస్తుంది. ‘బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో గూగుల్ జత కట్టడం ఆనందంగా ఉందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా.. ఇండియా ఎదుర్కొంటోన్న పలు సామాజిక సమస్యలకు టెక్నాలజీ సొల్యుషన్స్‌‌ను కూడా అందించనుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రొగ్రామ్‌‌లో చేరే తేదీని ప్రకటిస్తామన్నారు.