లోకల్బాడీ ఎలక్షన్స్ ఈజీగా తీసుకోవద్దు..పదేండ్ల బీఆర్ఎస్ అప్పుల పాలన గుర్తించుకోవాలి : ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి

లోకల్బాడీ ఎలక్షన్స్ ఈజీగా తీసుకోవద్దు..పదేండ్ల బీఆర్ఎస్ అప్పుల పాలన గుర్తించుకోవాలి : ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, వెలుగు: రానున్న లోకల్​బాడీ ఎన్నికలను ప్రజలు ఈజీగా తీసుకోవద్దని, పదేండ్ల బీఆర్ఎస్ అప్పుల పాలనను గుర్తుచేసుకోవాలని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి కోరారు. ఆదివారం నిజామాబాద్​లో మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రెసిడెంట్​గా ధర్మపురి సంజయ్​ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  బీఆర్ఎస్ విధ్వంస పాలనలో జరిగిన నష్టాలను సీఎం రేవంత్​రెడ్డి ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నారని తెలిపారు.

 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్​కు ఫీజు కడుతున్నామని, సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామన్నారు. కాంగ్రెస్​ అంటేనే అభివృద్ధి అని,  జిల్లాకు లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీమ్​లు, యూనివర్సిటీ తమ పాలనలోనే వచ్చాయన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీ కూడా తెచ్చామన్నారు. వీటిని ఇవ్వడానికి బీఆర్ఎస్​ పాలకులకు చేతకాలేదని విమర్శించారు.

 మంత్రిగా డి.శ్రీనివాస్​ నగర పాలక సంస్థ పరిధిలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ తీసుకురాగా, తాను బోధన్​కు రూ.22 కోట్ల వాటర్​ స్కీమ్​ మంజూరు చేయించానన్నారు. ఈ రెండు పనులను బీఆర్ఎస్​ సర్కార్ పూర్తి చేయించలేకపోయిందన్నారు. డి.శ్రీనివాస్ ప్రోత్సాహం వల్లే తాను 1989లో పాలిటిక్స్​లోకి వచ్చానని ఎంతో స్నేహంగా ఉండేవారమన్నారు. ఆయన కుమారుడు మాజీ మేయర్ సంజయ్​కు తప్పకుండా ప్రభుత్వ పదవిని ఇస్తామన్నారు.    

కాపు సంఘానికి నిధులు : షబ్బీర్​అలీ

శివాజీనగర్ మున్నూరు కాపు సంఘానికి రూ.38 లక్షలు ఇచ్చామని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ తెలిపారు. మరికొన్ని సంఘాలకు రూ.35 లక్షలు ఇచ్చామన్నారు. మున్నూర్ కాపులతో కాంగ్రెస్​కు విడదీయలేని బంధం ఉందన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన శివశంకర్ వల్లే తాను కాంగ్రెస్​ పాలిటిక్స్​లో ఎదిగానన్నారు. 

డి.శ్రీనివాస్​ అంచనా తప్పలే..

ఇందూర్ జిల్లా రాజకీయ నేతలుగా అర్గుల్ రాజారామ్​, డి.శ్రీనివాస్​ చిరస్మరణీయులని టీపీసీసీ చీఫ్​ మహేశ్​​గౌడ్ తెలిపారు. చరిత్రలో వారి పేరు నిలిచిపోయిందన్నారు. డి.శ్రీనివాస్​ పిలుపుమేరకు ఎన్​ఎస్​యూఐ జిల్లా ప్రెసిడెంట్​గా రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తాను పీసీసీ  ప్రెసిడెంట్ అవుతానని డి.శ్రీనివాస్​ ముందే అంచనా వేశారని గుర్తు చేశారు. తండ్రి బాటలో ఆయన కొడుకు డి.సంజయ్​ మున్నూరు కాపు సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకావడం శుభసూచకమన్నారు. 

తనకు అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని ధర్మపురి సంజయ్​ అన్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్​, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, ధర్మపురి సురేందర్, పుప్పాల శోభ తదితరులు పాల్గొన్నారు.

డెవలప్​మెంట్​ పనులకు భూమిపూజ

ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​గౌడ్​, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి పలు డెవలప్​మెంట్​ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. నందిపేట శివారులోని జన్నేపల్లి మెయిన్ రోడ్డు నుంచి లక్కంపల్లి, చింరాజ్​పల్లి, తల్వెద వరకూ రూ.6.93 కోట్ల పనులకు భూమిపూజ చేశారు. రూ.2.28 కోట్లతో ఆంధ్రానగర్​-, ఇందిరానగర్​, లక్ష్మాపూర్​ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఐలాపూర్​లో రూ.2.45 కోట్లతో నిర్మించే ఎస్సీ హాస్టల్​ పనులకు పూజ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి ఉన్నారు.