సెప్టెంబర్ నెల జీఎస్టీ కలెక్షన్ రికార్డు స్థాయిలో నమోదైంది. రూ.1,17,010 కోట్ల టాక్స్ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సీజీఎస్టీ రూ,20,578 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.26,767 కోట్లు, ఐజీఎస్టీ రూ.60,911 కోట్లు, సెస్ రూ.8,754 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఐజీఎస్టీ నుంచి రూ.28,812 కోట్లు సీజీఎస్టీకి, రూ.24,140 కోట్లు ఎస్జీఎస్టీకి సెటిల్ చేసినట్లు తెలిపింది. అలాగే రాష్ట్రాలకు అందించాల్సిన జీఎస్టీ పరిహారం రూ.22 వేల కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది.
గతేడాది సెప్టెంబర్లో రూ.95,480 కోట్ల జీఎస్టీ రాగా.. ఈ సారి 23 శాతం పెరిగింది. కరోనా ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో సగటున నెలకు రూ.1.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా.. రెండో త్రైమాసికంలో ఇది ఐదు శాతం పెరిగి రూ.1.15 లక్షల కోట్లకు చేరింది.