
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ప్రభుత్వం పనిచేస్తోందని విప్, వేములవాడ ఎమ్మెల్యేఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధిని రంగురంగుల బ్రోచర్లలో, వీడియోల్లో చూపెట్టారని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చేసి చూపెడుతోందన్నారు.
మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. అనంతరం ఈవో చాంబర్లో రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల పురోగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగమశాస్ర్తం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎండోమెంట్ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, లీడర్లు పాల్గొన్నారు.