స్టాక్‌ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్న ఎల్‌ఐసీ

స్టాక్‌ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్న ఎల్‌ఐసీ
  • అంత ఈజీ కాదన్న అనలిస్ట్‌‌లు
  • ఎన్నో మార్పులవసరం
  • వాల్యుయేషన్‌‌ లెక్కకట్టడం కష్టమే
  • ఐపీఓకి వస్తే..షేర్‌‌‌‌హోల్డర్స్‌‌కు మస్తు లాభం

బీమాతో దేశ ప్రజలకు ధీమా కల్పిస్తున్న మార్కెట్‌ రారాజు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పొంది రికార్డు సృష్టించిన సౌదీ ఆరామ్‌కో తరహాలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ కూడా ఒక సంచలనమే కానుంది. ఎందుకంటే 60 ఏళ్లకు పైగా బీమా సేవలందిస్తున్న ఈ కార్పొరేషన్​ అసలు విలువ ఎంతో ఇప్పుడు పబ్లిక్​కు తెలవనుంది. చిన్న పట్టణాల నుంచి పెద్ద సిటీలదాకా ప్రతి చోటా ఎల్​ఐసీకి సొంత ఆఫీసులున్నాయి. అలాగే దేశంలోని పెద్దపెద్ద కంపెనీలు, ప్రాజెక్టులలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఎకనమిక్‌ రిఫార్మ్స్‌ నేపథ్యంలో 20కి పైగా కంపెనీలు జీవిత బీమా మార్కెట్లోకి వచ్చినా మూడొంతుల మార్కెట్‌ వాటాతో వెలిగిపోతోంది ఎల్‌ఐసీ. అలాంటి ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం అందరూ ఎదురు చూపులు చూడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. కాకపోతే, ఎల్‌ఐసీ ఐపీఓకు ముందు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవల్సిన చర్యలు చాలా ఉన్నాయి.

న్యూఢిల్లీ :

ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా గుత్తాధిపత్యం సాగిస్తోన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌‌‌‌ఐసీ) మరికొన్ని నెలల్లో పబ్లిక్‌‌‌‌ ముందుకు రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఎల్‌‌‌‌ఐసీలోని కొంత వాటాలను విక్రయించనున్నామని ప్రభుత్వం తాజా బడ్జెట్‌‌‌‌లో వెల్లడించింది. ఈ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో అటు ఇన్వెస్టర్లు, ఇటు అనలిస్ట్‌‌‌‌లు ఎంతో సంబరపడుతున్నారు. మెజార్టీ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌ అయిన ప్రభుత్వానికి ఎల్‌‌‌‌ఐసీ స్థిరమైన ప్రాఫిట్స్ అందజేస్తుండటంతో, దీని లిస్టింగ్ ఎప్పుడెప్పుడా అని ఇన్వెస్టర్లు ఆత్రుతతో వేచిచూస్తున్నారు.

2000లో ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ను కూడా ఆహ్వానిస్తూ తలుపులు బార్ల తీసింది.  ప్రైవేట్ సెక్టార్ నుంచి ఎల్‌‌‌‌ఐసీకి తీవ్ర పోటీ వస్తున్నప్పటికీ, మార్కెట్‌‌‌‌లో అధిక వాటా దీనిదే.  రూ.30 లక్షల కోట్ల నుంచి రూ.40 లక్షల కోట్ల ఇండస్ట్రీని ఇది మేనేజ్‌‌‌‌ చేస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాక మార్కెట్‌‌‌‌లో ఉన్న 23 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటి బిజినెస్‌‌‌‌నూ కలిపి చూసినా కూడా.. ఎల్‌‌‌‌ఐసీనే పెద్దది. అంటే గ్లోబల్‌‌‌‌గా అతిపెద్ద ఐపీఓగా నిలిచిన సౌదీ ఆరామ్‌‌‌‌కో ఎలానో.. మన మార్కెట్‌‌‌‌లో ఎల్‌‌‌‌ఐసీ ఐపీఓ అలాంటిది కాబోతుందని అంచనా. ఎల్‌‌‌‌ఐసీ ఐపీఓకు రావడంతో, కంపెనీలో పారదర్శకత మరింత పెరుగుతుందని అనలిస్ట్‌‌‌‌లంటున్నారు. అయితే మార్కెట్‌‌‌‌లోకి అడుగుపెట్టడం అంత ఈజీ మాత్రం కాదని, చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్ క్యాపిటల్‌‌‌‌ నుంచి ఎల్‌‌‌‌ఐసీ యాక్ట్ 1956 వరకు ప్రతి దానిలో చాలా ప్రొవిజన్లను సవరించాలని అంటున్నారు. దీంతో మరిన్ని ప్రాఫిట్స్‌‌‌‌ను షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్‌‌‌‌కు అందించడం కుదురుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్‌‌‌‌ఐసీ కేవలం 5 శాతం ప్రాఫిట్స్‌‌‌‌ను మాత్రమే షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్‌‌‌‌కు ఇస్తోంది. మిగతా 95 శాతం పాలసీ హోల్డర్స్‌‌‌‌కే వెళ్తోంది. ఇది ఇప్పుడు మారనుంది. ప్రభుత్వానికి మాత్రమే కాక, మిగిలిన షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్‌‌‌‌ చేతుల్లోకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ ఎల్‌‌‌‌ఐసీ ఐపీఓకి ఏమైనా అవరోధాలు ఎదురైతే… అది ఎల్‌‌‌‌ఐసీ యాక్ట్‌‌‌‌కు సంబంధించినవే కానున్నాయని అనలిస్ట్‌‌‌‌లంటున్నారు.

వాల్యుయేషన్…

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. అంటే ఇప్పుడు పాలసీ కొంటే.. ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సిందే. ఎల్‌‌‌‌ఐసీ భవిష్యత్‌‌‌‌ అంతా ఈ ఫ్యూచర్ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌పైనే ఆధారపడి ఉంటుంది. దానిమీద ఆధారపడే  ఎల్‌‌‌‌ఐసీ ప్రాఫిట్స్ ఉంటాయి. ఎల్‌‌‌‌ఐసీ కంపెనీ వాల్యు కూడా ప్రస్తుతం చేస్తున్న బిజినెస్‌‌‌‌లు జనరేట్ చేసే ఫ్యూచర్ ప్రాఫిట్స్ బట్టి లెక్కించాలి. ఎల్‌‌‌‌ఐసీ ఇప్పటి వరకు దాని వాల్యును బయటికి వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఎల్‌‌‌‌ఐసీ పబ్లిక్ వెళ్లాలనుకుంటోంది కాబట్టి.. దాని వాల్యు బయటికి తెలియాల్సి ఉంది. ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలతో పోలిస్తే.. ఎల్‌‌‌‌ఐసీ ప్రాఫిట్  షేరింగ్ అరేంజ్‌‌‌‌మెంట్ ఎలా వేరుగా  ఉంటుందో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌‌‌‌ల నేచర్‌‌‌‌‌‌‌‌ను కూడా అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు తప్పనిసరిగా రెండు సెపరేట్ పూల్స్‌‌‌‌ను ఆపరేట్ చేయాలి. ఒకటి పార్‌‌‌‌‌‌‌‌ ఫండింగ్.. దీనిలో సర్‌‌‌‌‌‌‌‌ప్లెస్‌‌‌‌లో 10 శాతం షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్‌‌‌‌కు చెల్లిస్తారు. రెండోది నాన్ పార్ ఫండింగ్.. దీనిలో లాభాలన్నీ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్‌‌‌‌కే వెళ్తాయి. ఎల్‌‌‌‌ఐసీ కేవలం ఒకటే పూల్‌‌‌‌ను ఆపరేట్ చేస్తోంది. అన్ని రకాల చెల్లింపులు, రిసిప్ట్స్‌‌‌‌లకు ఒకే అకౌంట్‌‌‌‌ ఉండాలని ఎల్‌‌‌‌ఐసీ యాక్ట్ సెక్షన్ 24 ప్రొవిజన్స్‌‌‌‌లో పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని కంపెనీలతో పోలిస్తే ఇదే ఎల్‌‌‌‌ఐసీకి ప్రధాన అవరోధంగా ఉంటోంది. ఎల్‌‌‌‌ఐసీ మార్కెట్‌‌‌‌లో అడుగుపెట్టాలంటే.. తొలుత దీన్ని రివ్యూ చేయాల్సి ఉంది. ఎల్‌‌‌‌ఐసీ యాక్ట్‌‌‌‌కు 2011లో కూడా ఒకసారి సవరణ చేశారు. అప్పుడు పెయిడప్ క్యాపిటల్‌‌‌‌ను రూ.5 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు. అయితే యాక్ట్‌‌‌‌లో మార్పులు వాల్యుపై వెంటనే పాజిటివ్  ప్రభావాన్ని చూపించవని అంచనా.

12 లక్షల మంది ఏజెంట్లు….

అతిపెద్ద మొత్తంలో ఆస్తులు, కస్టమర్ బేస్, లక్షల కొద్దీ ఏజెంట్స్, రూరల్ ఇండియాలో మెజార్టీ షేరు, ఈక్విటీ, రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్‌‌‌‌లో చరిత్రాత్మకమైన వాల్యు,  కస్టమర్ ట్రస్ట్… ఇవన్నీ ఐపీఓ విషయంలో ఎల్‌‌‌‌ఐసీకి ఎక్కువ వాల్యుయేషన్‌‌‌‌ను అందించనున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా రాయ్ అన్నారు. ఎల్‌‌‌‌ఐసీకి సుమారు 12 లక్షల మంది ఏజెంట్లున్నారు. ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని ఇన్సూరర్లందరికీ కలిపినా అంతమంది ఏజెంట్లు లేరు. ఎల్‌‌‌‌ఐసీకి ఉన్న ఏజెంట్లను చేరుకోవడం కోసం ప్రైవేట్ ఇన్సూరర్లు బ్యాంక్‌‌‌‌లతో కలిసి తమ సర్వీసులను అందజేస్తున్నాయి. ఎల్‌‌‌‌ఐసీ లిస్టింగ్‌‌‌‌తో దాని ఫైనాన్సియల్ స్టేట్‌‌‌‌మెంట్లు పారదర్శకంగా ఉంటాయని, షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్ అందరికీ మంచి జరుగనుందని మరో అనలిస్ట్ చెప్పారు. ప్రారంభంలో ఎల్‌‌‌‌ఐసీ వాల్యుయేషన్ డిస్కౌంట్‌‌‌‌లో ఉండనుందని, ఆ తర్వాత డిజిఇన్వెస్ట్‌‌‌‌మెంట్ సమయంలో పెరగనుందని ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అడ్వయిజరీ సంస్థ ఐథాట్ ఫౌండర్ శ్యామ్ శేఖర్ అన్నారు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌‌‌‌ దాని ఎంబెడెడ్ వాల్యు కంటే మూడింతలు ఎక్కువగా ట్రేడవనుందని పేర్కొన్నారు. అంతేకాక ఇన్సూరెన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు బుల్లిష్ అవుట్‌‌‌‌లుక్ ఉండటం కూడా దీనికి మరో కారణంగా ఉంది. ఎల్‌‌‌‌ఐసీ హౌస్‌‌‌‌హోల్డ్‌‌‌‌ నేమ్‌‌‌‌గా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది. ఈ నేమ్‌‌‌‌ను అందిపుచ్చుకుని, ప్రభుత్వం ఎల్‌‌‌‌ఐసీలో ఉన్న 10% మేర వాటాలను అమ్మి రూ.2.1 లక్షల కోట్లను సేకరించాలని చూస్తోంది. డిజిఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా ఎల్‌‌‌‌ఐసీని ఐపీఓకు తీసుకెళ్తోంది.