పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం.బంజర్ రింగ్ సెంటర్లో నేషనల్ హైవేపై గ్రానైట్ రాళ్లు పడగా.. పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ నుంచి గ్రానైట్ రాళ్లతో ఓ ట్రాలీ లారీ కాకినాడ పోర్ట్కు వెళ్తోంది. మార్గమధ్యలోని వీఎం.బంజర్ రింగ్ సెంటర్ వద్ద లారీ ఓవర్ కటింగ్ చేయడంతో ట్రాలీపై ఉన్న మూడు పెద్ద గ్రానైట్ రాళ్లు రోడ్డుపై పడిపోయాయి.
దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రింగ్ సెంటర్లో తెల్లవారుజామున రాళ్లు పడడం, ఆ సమయంలో జన సంచారం ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రానైట్ రాళ్లు పడిపోయిన తర్వాత కూడా లారీ ఆగకుండా వెళ్లడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు 15 కిలోమీటర్ల దూరంలో లారీని పట్టుకున్నారు. భారీ క్రేన్ల సాయంతో గ్రానైట్ రాళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
