- 12 జిల్లాల్లో మోతాదుకు మించి ఉంది
- కెనాల్ నీళ్లు పారే ప్రాంతాల్లో నైట్రోజన్ స్థాయి ఎక్కువగానే
- హైడ్రాలజీ ఆఫ్ తెలంగాణ స్టేట్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ భూతం వీడట్లేదు. 12 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆసిఫాబాద్, హన్మకొండ, జగిత్యాల వంటి ఏడు జిల్లాల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఆర్డీఎస్, జూరాల, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వ కింద భూముల్లో నైట్రోజన్ స్థాయి సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘హైడ్రాలజీ ఆఫ్ తెలంగాణ స్టేట్- 2020’ నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. భూగర్భ జలాల్లో 1.5 మిల్లీగ్రామ్/లీటర్ వరకు ఫ్లోరైడ్ ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. కానీ, 7 జిల్లాల్లో ఇది చాలా ఎక్కువగా ఉన్నట్లు, మరో ఐదు జిల్లాల్లో అక్కడక్కడ కాస్త ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవక ముందు 15 శాతం ఏరియాలో ఫ్లోరైడ్ శాతం హెచ్చుగా ఉంటే.. వర్షాలు కురిసిన తర్వాత 11 శాతం భూభాగంలో ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు.
ఫ్లోరైడ్ ఉన్న జిల్లాలు ఇవే..!
నల్గొండ జిల్లాలో వర్షాలకు ముందు 5.63, వర్షాల తర్వాత 3.63 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఈ జిల్లాలోని వెలమగూడ, వావిల్కోల్, నార్సింగ్భట్ల, ఎం. దోమపల్లి, పి. దోమపల్లి, మునుగోడు, అంగడిపేట, పామనగండ్ల, శివన్నగూడెం, కుదాభక్షుపల్లి, అంతంపేట, నామాపూర్, వెంకన్నగూడెం, అడవిదేవులపల్లి, కాల్వలపల్లి, ఔరావాణిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్టుగా స్టడీలో వెల్లడైంది.
జగిత్యాల జిల్లాలో వర్షాలకు ముందు 0.09 నుంచి 3.54 శాతం, వర్షాల తర్వాత 0.01 నుంచి 3.8 శాతం ఫోర్లైడ్ ఉన్నట్టు బయటపడింది. ఈ జిల్లాలోని కొడిమ్యాల మండలం చెప్యాలలో అత్యధికంగా 3.54 శాతం ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఇదే జిల్లాలోని మేడిపల్లి మండలం రంగాపూర్, మల్లాపూర్ మండలంలోని సాతారాం, ఇంద్రానగర్, ఓగ్లాపూర్, గుండంపల్లి, ధర్మపురి మండలంలోని బుద్ధేశ్పల్లి, గొల్లపల్లి మండలంలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలో వర్షాలకు ముందు 4.6, వర్షాల తర్వాత 3.3 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ఈ జిల్లాలోని చిన్నాపూర్, సింగూరు, బండ్లగూడ, కోహీర్లో ఫ్లోరైడ్ పరిమితికి ఉంచి ఉన్నట్టుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు 5.1, వర్షాల తర్వాత 2.6 మి.గ్రా/లీటర్ ఉన్నట్టుగా స్టడీలో తేల్చారు. ఈ జిల్లాలోని బాటసింగారం, బోడకొండ, గుమ్మడివెల్లిలో ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్నట్టు గుర్తించారు.
హన్మకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు 8.5, వర్షాల తర్వాత 8.02 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టు తేల్చారు. జిల్లాలోని ఎల్కతుర్తి, పాటిని, సింగారం, శనిగరం, దేవన్నపేట, కోమటిపల్లి, ధర్మసాగర్లో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్నట్టు తేల్చారు. వరంగల్ నగరంలోని గౌతమినగర్లో 23.5 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టుగా గుర్తించారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్, తిమ్మాపూర్లోనూ ఫ్లోరైడ్ శాతం ఎక్కువున్నట్టు నిర్దారించారు.
జనగామ జిల్లాలోని కొన్ని ఊర్లలో వర్షాలకు ముందు 3.02, వర్షాల తర్వాత 4.8 మి.గ్రా/లీటర్ ఉన్నట్టుగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో వర్షాలకు ముందు 6.62, వర్షాల తర్వాత 2.5 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టుగా నిర్ధారించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు 3.27, వర్షాల తర్వాత 6 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో వర్షాలకు ముందు ఫ్లోరైడ్ 1.7 వర్షాల తర్వాత 3.9 మి.గ్రా/లీటర్ ఉన్నట్టు తేలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు 3.47, వర్షాల తర్వాత 3 మి.గ్రా/లీటర్ ఫ్లోరైడ్ ఉన్నట్టుగా వెల్లడైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ముందు 2.69, వర్షాల తర్వాత 3.3 మి.గ్రా/లీటర్ ఉన్నట్టుగా తేలింది.
1,118 శాంపిళ్లలో ఎక్కువగా..!
ఉమ్మడి ఏపీలో నల్గొండ జిల్లాకే పరిమితమైన ఫ్లోరైడ్ పలు జిల్లాలకు విస్తరించినట్టుగా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేషనల్ వాటర్ పాలసీ ఆఫ్ ఇండియా –- 2012 గైడ్లైన్స్ మేరకు ఏటా భూగర్భ జలాల నాణ్యతను వర్షాలు కురవక ముందు మే నెలలో, వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్లో పలు శాంపిళ్లను పరీక్షించి నిర్ధారిస్తారు. 2019 మే నెలలో 3,551 శాంపిళ్లు, అదే ఏడాది నవంబర్లో 3,767 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 1,118 శాంపిళ్లలో 1.5 మి.గ్రా/లీటర్ కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ శాతం ఉన్నట్టుగా గుర్తించారు. ఆర్డీఎస్, జూరాల, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఎస్సారెస్పీ కాలువల కింద భూముల్లో నైట్రోజన్ స్థాయి 45 నుంచి 47 శాతం ఉన్నట్టుగా గుర్తించారు. సాధారణంగా నైట్రోజన్ 45 శాతం లోపు ఉండాలి.
