ఉమ్మడి కరీంనగర్ లో పెరుగుతున్న గన్​ కల్చర్​..

ఉమ్మడి కరీంనగర్ లో  పెరుగుతున్న గన్​ కల్చర్​..

జగిత్యాల, వెలుగు:  గత   ఐదేండ్ల కాలంలో    ఉమ్మడి జిల్లాలో కాల్పుల ఘట నలు కలవరపెడుతున్నాయి.  ఇటీవల  ఎక్కడో ఒక చోట గన్ తో బెదిరింపులు, మర్డర్లు  జరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్​ నుంచి  అక్రమంగా గన్స్​ తెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. వాటితో  సెటిల్మెంట్  దందాలకు తెరలేపుతున్నారు.  మరో వైపు గన్​ లైసెన్స్  ఉన్న వ్యక్తులు కూడా  గన్​తో   బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జిల్లాలో 33 గన్​ లైసెన్స్​లు

జిల్లాలో 33 లైసెన్స్ గన్స్ ఉన్నాయి. ఇందులో 9 గన్స్ వివిధ బ్యాంకు సెక్యూరిటీ  కోసం మంజూరు చేయగా, ఇతరులకు 24  గన్ లైసెన్స్ లు మంజూరు చేశారు. గన్ లైసెన్సులు ముఖ్యంగా ప్రాణ భయం ఉన్న లీడర్లకు, మాజీ నక్సలైట్స్, బిజినెన్  మెన్​కు రూల్స్ కు లోబడి గన్ లైసెన్స్ మంజూరు చేస్తుంటారు. ఆత్మ రక్షణ కోసం వాడాల్సిన గన్​ను బెదిరింపులకు గురి చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు విమర్శలున్నాయి.  లైసెన్స్ కలిగిన గన్స్ కాకుండా కొందరు రౌడీ షీటర్లు, సెటిల్మెంట్ చేసే వ్యక్తులు, రియల్టర్లు నాటు తుపాకులు, లోకల్ మేడ్ గన్స్, తపంచాలు  కొంటున్నారు.   వీటి ధర కేవలం రూ. 5 వేల నుంచి రూ. లక్ష లోపు పలుకుతున్నట్టు తెలుస్తోంది. 

ఆందోళన కలిగిస్తున్న ఆరుగురి మూఠా  

 కోరుట్ల ప్రాంతానికి చెందిన లక్ష్మి నర్సయ్య.. పాత నేరస్తుడైన  రాజు భాయ్ అలియాస్ గంగారాం  ద్వారా బొంబాయి లోని నారాయణ, రమేశ్, పాటిల్, బిట్టు తో కలిసి మూఠాగ ఏర్పడ్డాడు. బిజినెస్ మ్యాన్స్, రియల్టర్ల ను బెదిరింపులకు గురి చేసి అక్రమ వసూళ్లు చేయాలని ప్లాన్​ వేశాడు.  ఇందులో భాగంగా రూ. 60 వేలతో గన్ కొనుగోలు చేసి కోరుట్ల శివారు ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసిన ఘటన వెలుగు లోకి రావడం తో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. గతం లో జరిగిన ఘటనల్లో నాటు తుపాకీలు, తపంచాలు, లోకల్ మెడ్ గన్స్ దొరికాయి. కానీ కోరుట్ల ఘటనలో మాత్రం యూఎస్ మేడ్​ గన్ దొరకడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఇంకా ఎవరైనా గన్స్ కొనుగోలు చేశారా..? బెదిరింపులకు పాల్పడ్డ ఘనటలు ఉన్నాయా? అనే కోణం లో పోలీసులు  తేల్చాల్సి ఉంది. 

గతంలో జరిగిన ఘటనలు.. 

  •   2017 లో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో  భూ సమస్యల నేపథ్యం లో మాజీ సర్పంచ్ రాజన్నను దుండగులు కాల్చడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.
  •   2018 లో జగిత్యాల జిల్లా లోని ధర్మపురి పట్టణం లో వైన్స్ వద్ద రామ గుండం కు చెందిన సత్య నారాయణ గౌడ్ ను కొందరు కాల్చి చంపారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
  •   2019 లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లో ఓ వ్యాపార వేత్త కొడుకు భూ తగాధాల నేపథ్యం లో లైసెన్స్ గన్ తో చంపుతానని బెదిరించాడు. దీంతో  బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశారు. 
  •   2020 ఫిబ్రవరి 3న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని ఇస్రాజుపల్లె లో రాజిరెడ్డిని అతని బంధువు శ్రీనివాస్ కుటుంబ గొడవల నేపద్యం లో గన్ తో కాల్పులు పాల్పడడం తో తీవ్ర గాయాలపాలయ్యాడు.
  •  2020 ఫిబ్రవరి 14 న  పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట గ్రామం లో రిటైర్డ్ అధికారి తిరుమల రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. అయితే గన్ ఫైరింగ్ జనవరి 1న జరిగినట్లు పోలీసులు విచారణ లో తేలింది 

కోరుట్ల మండలం ఐలాపూర్ లో పండ్ల వ్యాపారి లక్ష్మి నర్సయ్య బిజినెస్ లో నష్టపోయాడు. దీంతో  ముఠా ఏర్పాటు చేసి,  ఒక గన్ తో ఈజీ మనీ  కోసం ప్లాన్​ వేశాడు. బడా రియల్టర్స్, బిజినెస్ మ్యాన్స్, లీడర్ల  ను బెదిరించి,  అక్రమార్జన   మొదలు పెట్టాలనుకున్నాడు.  అందుకు ఓ గన్​ కూడా కొన్నాడు. పాత నేరస్థులతో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు.  అక్రమంగా గన్​ ఉన్నట్టు    పోలీసులకు తెలియడంతో  అతన్ని పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో గత కొన్ని రోజులుగా కలవరపెడుతున్నాయి. గన్ తో బెదిరించిన సంఘటనల్లో కొన్ని వెలుగు లోకి రాగా,  ఫిర్యాదు చేసేందుకు కూడా కొందరు భయపడ్డారు.  గన్ లైసెన్స్ ఉన్న వ్యక్తుపైనా ఫిర్యాదులు ఉన్నాయి.