న్యూఢిల్లీ: జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.38 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది జనవరితో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. వరసగా నాలుగో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లను దాటాయి. జనవరి నెల వసూళ్లలో సీజీఎస్టీ రూ. 24,674 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 32,016 కోట్లు, ఐజీఎస్టీ రూ. 72,030 కోట్లు, సెస్ రూ. 9,674 కోట్లు ఉన్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. జీఎస్టీ వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు 2021 ఏప్రిల్నెలలో వచ్చాయి. ఆ నెలలో వసూళ్లు రూ. 1,39,708 కోట్లు. జనవరి 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి వసూళ్లు 25 శాతం అధికమని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఎకనమిక్ రికవరీతోపాటు, ఎగవేతదారులపై నిఘా, ఫేక్ బిల్లర్లపై చర్యలు వల్ల వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయని వివరించింది. రాబోయే నెలల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. జనవరి 2022లో 1.05 కోట్ల జీఎస్టీఆర్–3బీ ఫైలయ్యాయని, ఇందులో 36 లక్షలు క్వార్టర్లీ రిటర్న్స్ అని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది.
