న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కలెక్షన్ నవంబర్లో రికార్డ్ లెవెల్కు చేరుకుంది. ఏకంగా రూ. 1.31,526 కోట్లను ప్రభుత్వం సేకరించగలిగింది. ఇది కిందటేడాది నవంబర్లో వచ్చిన రూ. 1.05 లక్షల కోట్లు కంటే 25 శాతం ఎక్కువ. మొత్తంగా జీఎస్టీ హిస్టరీలోనే సెకెండ్ హయ్యస్ట్. ఈ ఏడాది అక్టోబర్లో కూడా ప్రభుత్వానికి రూ. 1.30 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నడూ లేనంతగా రూ. 1.41 లక్షల కోట్లను ప్రభుత్వం జీఎస్టీ కింద సేకరించగలిగింది. నవంబర్ జీఎస్టీ కలెక్షన్లో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) వాటా రూ. 23,978 కోట్లు. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వాటా రూ. 31,127 కోట్లు కాగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) వాటా రూ. 66,815 కోట్లు (ఇందులో దిగుమతులపై వేసిన రూ. 32,165 కోట్ల ట్యాక్స్ కలిసుంది). సెస్ కింద రూ. 9,606 కోట్ల రెవెన్యూ రాగా, ఇందులో రూ. 653 కోట్లు దిగుమతులపై వేసిన సెస్ వలన వచ్చాయి. కాగా, రూ. 1.30 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూని దాటడం వరసగా ఇది రెండో నెల.
ఎకానమీ పెరుగుతోంది..
బిజినెస్ యాక్టివిటీ సాధారణ స్థాయికి వస్తుండడంతో ఎకానమీ రికవరీ అవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. వరసగా ఐదో నెలలో కూడా జీఎస్టీ రెవెన్యూ రూ. 1 లక్ష కోట్లను దాటిందని గుర్తు చేస్తున్నారు. ‘ నవంబర్లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ , మొత్తం జీఎస్టీ హిస్టరీలోనే సెకెండ్ హయ్యస్ట్. ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ మొదటి ప్లేస్లో ఉంది’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. జీఎస్టీ కలెక్షన్ పెరుగుతూ ఉండడానికి కారణం ప్రభుత్వం తెస్తున్న పాలసీలు, విధానాలే అని అభిప్రాయపడింది. కాగా, ఎక్సైజ్ డ్యూటి, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి వివిధ రకాల ట్యాక్స్లను తొలగించి వీటి ప్లేస్లో జీఎస్టీని ప్రభుత్వం తెచ్చింది. 2017 జులై 1 నుంచి ఈ ట్యాక్స్ సిస్టమ్ అమలవుతోంది.
జీఎస్టీ రిటర్న్లు పెరిగాయ్..
డెడ్లైన్ పూర్తయినా జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేయని వారిపై ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. వారి ఈ–వే బిల్లులను ఆపేయడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను అందించకపోవడం వంటివి చేస్తోంది. దీంతో జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేసేవారు పెరుగుతున్నారని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ‘ నవంబర్లోని మొదటి 3 వారాల్లో రోజువారి సగటు ఈ–వే బిల్లుల జనరేషన్ తగ్గింది. దీన్ని బట్టి డిసెంబర్ జీఎస్టీ కలెక్షన్ తగ్గుతుందని అనిపిస్తోంది’ అని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అన్నారు. ‘ఆర్థిక సంవత్సరం 2021–22 లో సెంట్రల్ జీఎస్టీ రూ. 5.8 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ఇది బడ్జెట్ అంచనాల కంటే రూ. 50 వేల కోట్లు ఎక్కువ’ అని అంచనావేశారు. చాలా రాష్ట్రాలలో జీఎస్టీ కలెక్షన్ 18–30 శాతం మేర పెరిగిందని, దీనికి తోడు దిగుమతుల నుంచి వచ్చిన ట్యాక్స్ కూడా పెరిగిందని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మని పేర్కొన్నారు. రాష్ట్రాల ఎకానమీ రికవరీ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎకానమీ గ్రోత్కు నవంబర్ జీఎస్టీ కలెక్షన్ నిదర్శనమని శార్దుల్ అమర్చంద్ మంగళదాస్ అండ్ కో పార్టనర్ రాజత్ బోస్ పేర్కొన్నారు. మరో కరోనా వేవ్ లేకపోతే, రానున్న నెలల్లో కూడా జీఎస్టీ కలెక్షన్ పెరుగుతుందని అంచనావేశారు.
జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురాలేం..
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ కిందకు తీసుకురాలేమని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిలే తీసుకుందని గుర్తు చేశారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తెస్తే రెవెన్యూ తగ్గిపోతుంది. అందుకే 45 వ జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్పై వేస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వలన 2020–21 లో కేంద్ర ప్రభుత్వానికి రూ. 3.72 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించారు. ఇందులో రూ. 20 వేల కోట్లను రాష్ట్రాలకు ఇచ్చామని అన్నారు. పెట్రోల్, డీజిల్ నుంచి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వలన 2019–20 లో ప్రభుత్వానికి రూ. 1.78 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది. 2020–21 లో ఈ రెవెన్యూ రెండింతలు పెరిగి రూ. 3.72 లక్షల కోట్లకు ఎగిసింది. పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్లు పెరగడంతోనే ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ కూడా పెరిగింది. 2019 లో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 19.98 గా, డీజిల్పై రూ. 15.83 గా ఉండేది. కిందటేడాది ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని రెండు సార్లు పెంచింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్పై రూ. 32.98, డీజిల్పై రూ. 31.83 ను ప్రభుత్వం వసూలు చేస్తోంది.