- దక్షిణాది రాష్ట్రాలకూ తీరనున్న ఎరువుల కొరత
- ఏటా దాదాపు 12.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్రారంభంతో తెలంగాణకు యూరియా కొరత తీరనుంది. ఈ ఫ్యాక్టరీలో ఏటా దాదాపు 12.50 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో సగం తెలంగాణ రైతులకే కేటాయిస్తారు. మిగతా యూరియాను ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు పంపుతారు. వివిధ కారణాలతో దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడి ఎరువులకు కటకట ఏర్పడింది. దేశానికి ఏటా 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 240 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 60 లక్షల మెట్రిక్ టన్నులు విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఈ కొరత తీర్చడంతో పాటు ఆర్థిక భారా న్ని తగ్గించడానికి మూతపడిన ఫ్యాక్టరీలను ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. నష్టాల కారణంగా 1999లో రామగుండం ఫ్యాక్టరీని మూసేశారు. దీన్ని తిరిగి తెరిచేందుకు 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 25న పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్లాంట్కు 2016 ఆగస్టు 7న మోడీ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి శంకుస్థాపన చేశారు. 2021 ఫిబ్రవరి 28న నిర్మాణం పూర్తయ్యింది. మార్చి 22 నుంచి యూరియా ఉత్పత్తి మొదలైంది.
పెరిగిన అంచనా వ్యయం
గ్యాస్ ఆధారంగా ఎరువులు తయారు చేస్తారు. దీనికోసం రూ.5,254 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించారు. కరోనా వల్ల అంచనా వ్యయం రూ.6,338 కోట్లకు చేరింది. ఇక్కడ రోజుకు 2, 200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మెషినరీ సప్లై చేసిన డెన్మార్క్ కంపెనీ హల్దార్ టాప్సేకు 11.7 శాతం, గెయిల్ సంస్థకు 14.3 శాతం వాటాలున్నాయి.
0.55 టీఎంసీల నీటి కేటాయింపు
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ప్లాంట్కు అవసరమైన 0.55 టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రతి రోజు 40.8 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు 27 కిలో మీటర్ల మేర పైప్ లైన్ వేశారు. నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.15 లక్ష లు చెల్లిస్తున్నారు. యూరియా ఉత్పత్తి కోసం రోజుకు 2.2 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ గ్యాస్ను వినియోగిస్తున్నారు. గుజరాత్ కు చెందిన జీఐటీఎల్ కంపెనీతో 2016 జులై 8న ఒప్పందం జరిగింది. కేజీ బేసిన్ పరిధిలోని తూర్పు గోదావరి జిల్లా కూచనపల్లి నుంచి గ్యాస్ సరఫరా జరుగుతోంది.
డబ్బులు రీయింబర్స్ చేయని తెలంగాణ సర్కారు
ప్లాంట్ను ఏర్పాటు చేసినప్పుడు లోన్ తీసుకున్న సందర్భంగా మేనేజ్మెంట్తెలంగాణ సర్కారుకు రూ.34 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టింది. దీన్ని రీయింబర్స్ చేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కార్ రూ.13 కోట్లు మాత్రమే చెల్లించింది. ప్లాంట్లో క్యాప్టివ్ పవర్ తయారీకి యూనిట్కు రూ.6 వరకు ఖర్చు అవుతుండగా, అందులో ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం రిబేట్ ఇవ్వాలి. దీనికి సంబంధించి 2021‒22లో రూ.5.4 కోట్లు శాంక్షన్ చేసినా ఇంకా డబ్బులు రిలీ జ్ చేయలేదు. వ్యాట్ వన్టైమ్ సెటిల్మెంట్ కింద రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అదీ ఇవ్వలేదు.
సబ్సిడీలో తెలంగాణకే రూ. 1800 కోట్లు
ఆర్ఎఫ్సీఎల్ 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు 3,74,728 మెట్రిక్ టన్నుల నీమ్ కోటేడ్ యూరియా ఉత్పత్తి చేసింది. ఇందులో తెలంగాణకే 2,11,073 మెట్రిక్ టన్నులు సప్లై అయ్యింది. ఏపీకి 1,00,321 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 63,334 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశారు. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 5,19,689 టన్నుల యూరియా ఉత్పత్తి చేయగా.. 2,60,780 టన్నులు ఒక్క తెలంగాణకే కేటాయించారు. ప్రతి ఏటా యూరియా ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్ చార్జీల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు సబ్సిడీగా ఇస్తుండగా, తెలంగాణకే రూ.1,800 కోట్ల మేరకు ప్రయోజనం చేకూరుతోంది. వివిధ కారణాలతో మొదట్లో సుమారు రూ.600 కోట్ల వరకు నష్టం వచ్చింది.
రైతుల కళ్లలో ఆనందం..
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి నాన్న వెంకటస్వామితో పాటు నేను చాలా శ్రమపడ్డాం. ఫ్యాక్టరీపై ఉన్న రూ.10 వేల కోట్ల మారటోరియమ్ తొలగింపజేశాను. ఆత్మనిర్భర్ భారత్లో గ్యాస్ ఆధారితంగా రామగుండం ప్లాంట్ను పీఎం మోడీ పునరుద్ధరించారు. ఈ ప్లాంట్ లో తయారయ్యే యూరియాతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. గతంలో యూరియా కోసం దుకాణాల ముందు చెప్పులు, బ్యాగులు లైన్లో పెట్టుకుని రోజుల తరబడి రైతులు వేచి చూసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులోకి వచ్చింది. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయిన యూరియాలో 50 శాతం తెలంగాణకే కేటాయించడం గొప్ప విషయం.
‒ వివేక్ వెంకటస్వామి,
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు