హనుమకొండ బస్​ టెర్మినల్ డౌటే!

హనుమకొండ బస్​ టెర్మినల్ డౌటే!

తాజాగా వరంగల్ బస్టాండ్​ డెవలప్​మెంట్​కు రూ.75 కోట్లతో ప్లాన్​

  •     'స్మార్ట్​ సిటీ'లో చేర్చి రివ్యూలతో హడావుడి చేసిన లీడర్లు, ఆఫీసర్లు
  •     చివరకు స్కీంలో దక్కని అవకాశం

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణాకు కేంద్రం హనుమకొండ బస్టాండ్​. ఇక్కడి నుంచే చుట్టుపక్కల జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్తుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే హనుమకొండ బస్టాండ్​ అతి పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం 1,500కు పైగా బస్సులు, లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, ఈ బస్టాండ్​ను ‘స్మార్ట్ బస్​ టెర్మినల్​’ గా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. స్మార్ట్​ సిటీ పథకంలో భాగంగా డెవలప్​ చేస్తామని గతంలో రివ్యూలతో  హడావుడి చేసిన లీడర్లు ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇదిలా ఉండగా..  మొన్నటికి మొన్న తెరమీదకు వచ్చిన వరంగల్ బస్ టర్మినల్​ కు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే డిజైన్​ ఫైనల్ కాగా రూ.75 కోట్లతో పనులు షురూ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 

పట్టించుకోని లీడర్లు.. 

ఉమ్మడి జిల్లాలో హనుమకొండ  బస్టాండ్​ నుంచే సంస్థకు ఆదాయం ఎక్కువ ఉంది.  దీంతో ఈ బస్టాండ్​ను మరింత డెవలప్​ చేయాలని గతంలో అధికారులు  భావించారు.  ఆర్టీసీ ఆఫీసర్లు అప్పట్లో ప్రణాళికలు కూడా రెడీ చేసి, రూ.100 కోట్ల వరకు ఖర్చు అంచనా వేశారు. బస్టాండ్లు, డిపోలు మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. 60 ప్లాట్​ ఫామ్​లతో సుమారు 5 ఎకరాల్లో ఈ టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  డిజిటల్ స్క్రీన్లు, ఇంటర్​ నెట్​ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఏటీఎం సెంటర్లు, హోటళ్లు తదితర సేవలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. దానివల్ల ప్రయాణికులకు మేలు జరగడంతో పాటు ఆర్టీసీకి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని భావించారు. కానీ ఆ తరువాత దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో స్మార్ట్ సిటీ నుంచి
 తొలగించారు. 

5 అంతస్తులు.. రూ.75 కోట్లతో వరంగల్ బస్టాండ్​..

వరంగల్ బస్టాండ్​ను డెవలప్​ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ, కుడా, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. రూ.75 కోట్ల అంచనాతో పనులకు ఓకే చెప్పింది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్​ను కూల్చేసి పక్కనే ఉన్న జీడబ్ల్యూఎంసీ, కుడా స్థలాలను కలిపి 2.32 ఎకరాల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ టర్మినల్​లో ఐదు అంతస్తులు, 32 ప్లాట్​ ఫామ్స్​ ఏర్పాటు చేయనున్నారు.   సెల్లార్లు, కమర్షియల్​ షెట్టర్స్​, రెస్టారెంట్స్​, డిజిటల్​ స్క్రీన్స్​, ఎస్కలేటర్స్​ ప్లాన్​ చేస్తున్నారు.  నగరంలో మెట్రో నియో రైలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో దానికి ఇంటర్​ కనెక్ట్ చేయడంతో పాటు పక్కనే ఉన్న రైల్వే స్టేషన్​ వరకు బస్​ టర్మినల్​ నుంచి స్కై వాక్​ నిర్మించనున్నారు. దీనికోసం కిందటి నెలలో బస్​ భవన్​ లో ఆర్టీసీ చైర్మన్​ గోవర్ధన్​, ఎండీ సజ్జనార్​, కుడా చైర్మన్​ సుందర్​ రాజ్​ యాదవ్, ఆర్టీసీ ఆఫీసర్లు బస్టాండ్​ ప్లాన్​ పై చర్చించారు. తొందర్లోనే పనులు స్టార్ట్​ చేసే అవకాశం ఉందని కుడా చైర్మన్​ సుందర్​ రాజ్​ యాదవ్​ చెబుతున్నారు.

ప్లాట్ ఫామ్స్​ సాల్తలేవు

హనుమకొండలో ఉన్న పాత బస్టాండ్​ ను 1974లో అప్పటి అవసరాలకు అనుగుణంగా 9 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. దాదాపు వందేళ్ల జీవితకాల అంచనాతో నిర్మించగా.. ఇప్పటికే కొన్నిచోట్ల పెచ్చులూడుతున్నాయి. దాని పక్కనే 1990లో కొత్తగా సిటీ బస్టాండ్ ను 12 ప్లాట్​ ఫాంలతో నిర్మించారు. కానీ రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ప్లాట్​ ఫామ్స్​ సరిపోవడం లేదు.  సరిపడా పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. ఇప్పటికైనా హనుమకొండ బస్​ టెర్మినల్​ ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు, ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.