
తాష్కెంట్ / బీజింగ్ : చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ను నిరవధికంగా వాయిదా వేశారు. తాష్కెంట్లో శుక్రవారం సమావేశమైన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు హాంగ్జూలో ఈ గేమ్స్ జరగాల్సి ఉన్నాయి. షాంఘైలో కరోనా ఉదృతి పెరగడంతో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. దీంతో గేమ్స్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. పరిస్థితులను సమీక్షించిన ఓసీఏ బోర్డు వాయిదా వైపే మొగ్గు చూపింది. వీలైనంత త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే 2024 ఒలింపిక్ ఏడాది కావడంతో.. కొవిడ్ కంట్రోల్లో ఉంటే 2023లోనే గేమ్స్ ఉండే చాన్సెస్ ఉన్నాయి. 61 క్రీడాంశాల్లో 11 వేల మంది అథ్లెట్లు బరిలోకి దిగాల్సి ఉంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద ఈవెంట్ పోస్ట్పోన్ కావడం ఇదే మొదటిసారి. ఆసియన్ యూత్ గేమ్స్, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్, రెండు డైమండ్ లీగ్ ట్రాక్ మీట్స్ను కూడా చైనా రద్దు చేసింది. మరోవైపు గేమ్స్ వాయిదా వేయడంపై ఇండియన్ అథ్లెట్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే ట్రెయినింగ్ మొదలుపెట్టిన అథ్లెట్లకు ఇది కచ్చితంగా ఎదురుదెబ్బేనని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) వ్యాఖ్యానించింది. వీలైనంత త్వరగా రీ షెడ్యూల్ చేస్తే బాగుంటుందని వెల్లడించింది. గేమ్స్ వాయిదా వల్ల బ్యాడ్మింటన్లో మరోసారి సెలెక్షన్ ట్రయల్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి ట్రయల్స్కు దూరమైన సైనా నెహ్వాల్లో ఆశలు మొదలయ్యాయి. ఇక గేమ్స్ పోస్ట్పోన్ వల్ల ప్రిపరేషన్కు ఎక్కువ టైమ్ లభించడం సంతోషంగా ఉందని హాకీ టీమ్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. ఏడు రోజుల వ్యవధిలో రెండు పెద్ద ఈవెంట్లు ఆడాల్సిన బాధ తప్పిందని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పేర్కొంది.