గురుకుల స్కూల్ స్టూడెంట్లపై హెచ్ఎం లైంగిక వేధింపులు

గురుకుల స్కూల్ స్టూడెంట్లపై హెచ్ఎం లైంగిక వేధింపులు

ఆసిఫాబాద్/కాగజ్ నగర్/శంషాబాద్, వెలుగు:  పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే దారి తప్పారు. ఓ చోట హెచ్ఎం, మరోచోట ప్రిన్సిపాల్.. స్టూడెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 440 మంది బాలికలు చదువుకుంటున్నారు. రూల్స్ ప్రకారం ఇక్కడ రెగ్యులర్ హెచ్ఎంగా మహిళా టీచర్​ను నియమించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా మేల్​ టీచర్ పార్థిరాంకు ఇన్​చార్జి హెచ్ఎంగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మొత్తం 12 మంది సీఆర్టీలు (కాంట్రాక్ట్​ రెసిడెన్షియల్​టీచర్స్) ఉండగా.. వారిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత మేల్ టీచర్లు స్కూల్ క్యాంపస్​లో ఉండడానికి వీల్లేదు. కానీ ఇన్​చార్జి హెచ్ఎం పార్థిరాం రాత్రి సమయాల్లో కూడా స్కూల్​లోనే ఉంటున్నారు. పాఠశాలలోని సీసీ  కెమెరాలు పనిచేయకున్నా రిపేర్లు చేయించడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవం రోజున ఇద్దరు హైస్కూల్​ విద్యార్థినులను పార్థిరాం తన రూమ్ కు పిలిపించుకుని లైంగికంగా వేధించాడు. 

స్టూడెంట్ల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎలాగోలా అక్కడి నుంచి​తప్పించుకున్న బాధిత స్టూడెంట్లు.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తెల్లారి జరిగిందంతా తమ తల్లిదండ్రులకు చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. పేరెంట్స్, గ్రామస్తులు కలిసి ఈ నెల 10న స్కూల్​కు వచ్చి నిలదీశారు. అయితే అప్పటికే మిగిలిన టీచర్లు హెచ్చరించడంతో పారిపోయిన పార్థిరాం.. ఆ రోజు నుంచి డ్యూటీకి రావడం లేదు. దీంతో గిరిజన సంఘాల నాయకులతో కలిసి గ్రామస్తులు ఆదివారం బెజ్జూరు పొలీస్ స్టేషన్​లో పార్థిరాంపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని కౌటల సీఐ సాదిక్ పాషా తెలిపారు. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా గర్ల్​చైల్డ్​ డెవలప్​మెంట్ ఆఫీసర్ శకుంతల, కాగజ్ నగర్ ఏటీడీవో కమర్ హుస్సేన్ ఆదివారం స్కూల్​లో విచారణ చేపట్టారు. బాధిత స్టూడెంట్లతో పాటు మిగిలిన విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని శకుంతల తెలిపారు. స్కూల్ టెంపరరీ హెచ్ఎంగా కుంటల మానేపల్లి టీచర్ మారుబాయిని నియమిస్తున్నట్టు చెప్పారు. 

హైదరాబాద్​లో ప్రైవేట్ స్కూల్​లో.. 

హైదరాబాద్​లో స్టూడెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదాన్ లోని వెంకటేశ్వర కాలనీలో గుర్రం శంకర్ అనే వ్యక్తి ‘రాకేశ్ విద్యానికేతన్’ పేరుతో స్కూల్ నడిపిస్తున్నాడు. అతడే ఎండీ, ప్రిన్సిపాల్​గా వ్యవహరిస్తున్నాడు. స్కూల్​లో 9, 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలతో శంకర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఇద్దరు స్టూడెంట్లు విషయాన్ని తమ పేరెంట్స్ కు చెప్పారు. ఆగ్రహానికి గురైన పేరెంట్స్ ప్రిన్సిపాల్ శంకర్ పై ఆదివారం మైలార్ దేవ్ పల్లి స్టేషన్​లో కంప్లయింట్ చేశారు. ‘‘ప్రిన్సిపాల్ అర్ధరాత్రి సమయాల్లో ఫోన్ చేసి మాట్లాడాలని, ముద్దు ఇవ్వాలని అడిగేవాడు. స్కూల్​లో కౌగిలించుకుని వేధించేవాడు” అని బాధిత స్టూడెంట్లు వాపోయారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, శంకర్​ను అరెస్టు చేశారు. కాగా, ఎఫ్ఐఆర్ కాపీ అందిన వెంటనే స్కూల్ పై యాక్షన్ తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎంఈవో రాంరెడ్డి తెలిపారు.