ఈ వేసవి చల్లగా ఉండాలంటే..

ఈ వేసవి చల్లగా ఉండాలంటే..

మండుతున్న ఎండలకు శరీరం త్వరగా నీరసించిపోతుంది. ఒంట్లో నీటిశాతం కూడా తగ్గుతుంది. కాబట్టి తక్షణ శక్తినిచ్చే పండ్లు, జ్యూస్​లు తీసుకోవడం మంచిది. అయితే, పండ్ల రసాల కన్నా.. తాజా పండ్ల ముక్కలు తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగితే నీరసం ఉండదు.

కొబ్బరి నీళ్లు

వేసవితాపాన్ని తీర్చే కొబ్బరి నీళ్లలో ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి శక్తి అందుతుంది.  కూల్​ డ్రింక్స్​లో పంచదార, కలర్స్‌‌, రసాయన పదార్థాలు కలిసి ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి.. వీటికి బదులుగా కొబ్బరినీళ్లు తాగితే దాహార్తి తీరుతుంది. అలాగే శరీరంలో వేడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ఎఫెక్టివ్‌‌గా పనిచేస్తాయి. శరీరంలోని బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్‌‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరానికి కావాల్సిన ఫైబర్‌‌ అందిస్తుంది.

పుదీనా

పుదీనా వేస్తే ఏ వంటకమైనా ఘుమఘుమలాడిపోవాల్సిందే. పుదీనా ప్రతిరోజు ఏదో ఒక రకంగా తీసుకుంటే రోజంతా శరీరం తాజాగా ఉంటుంది. సన్నగా తరిగి సలాడ్స్‌‌పై వేసుకోవచ్చు లేదంటే మజ్జిగలో కలుపుకోవచ్చు. పుదీనా రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. దానిమ్మ, ద్రాక్ష రసాలతో కూడా శరీరం చల్లబడుతుంది.

పుచ్చకాయ

వేసవిలో ఎక్కువగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిలో పోషక విలువలు పుష్కలం. నీటి శాతం కూడా ఎక్కువే. వేసవిలో ప్రతి రోజు పుచ్చకాయ తింటే డీహైడ్రేషన్‌‌ సమస్య ఉండదు. ఇందులో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థ సాఫీగా పని చేసేలా చేస్తుంది. వేసవిలో ఉక్కపోత వల్ల చెమటతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా బయటకు వెళ్లిపోయి.. విపరీతమైన దప్పిక వేస్తుంది.  దీన్ని తీర్చడంలో పుచ్చకాయ బెస్ట్​ ఆప్షన్​. పుచ్చకాయ రసంలో కొంచెం తేనె కలుపుకొని తాగితే నీరసం తగ్గుతుంది. వేసవిలో వచ్చే మలబద్ధకం సమస్య కూడా పుచ్చకాయతో పోతుంది.

మంచినీళ్లు

వేసవిలో వేడి ఎక్కువైనప్పుడు శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకుపోతుంది. కాబట్టి వడదెబ్బ, ఎండ నుంచి ఉపశమనం, డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వీటితో పాటు నిమ్మరసం, చెరుకురసం, మజ్జిగ తాగడం వల్ల ఎండలతో కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ప్రతి రోజు దాదాపు పది గ్లాసుల మంచినీళ్లు తాగాలి. స్నానం చేసే నీళ్లలో కొన్ని చుక్కలు వెనిగర్ వేస్తే చెమట లాంటి దుర్వాసన రాదు. నిమ్మరసం ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే ఫ్రెష్​గా ఉంటుంది.

 

పెరుగు

వేసవిలో పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి తోడ్పడే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. రోజంతా తాజాగా ఉంచడమే కాదు  ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. పెరుగు లేదంటే మజ్జిగ తీసుకున్నా శరీరం వేసవి తాపానికి గురికాదు. డీహైడ్రేషన్ సమస్యలు రావు. వేడి వేడి అన్నంలో పెరుగు కలుపుకొని తింటే విరేచనాలు తగ్గుతాయి. పెరుగులో కాస్త ఉప్పు కలుపుకుని తీసుకుంటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కొద్దిగా చ‌‌క్కెర క‌‌లుపుకుని తింటే శ‌‌రీరానికి తక్షణ శ‌‌క్తి అందుతుంది. మూత్రాశ‌‌య సంబంధ స‌‌మ‌‌స్యలు తగ్గిపోతాయి. పెరుగులో రకరకాల పండ్లు కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని రకాల ఇన్​ఫెక్షన్లు, వ్యాధులు రావు.

ఉల్లిగడ్డ

ఉల్లిగడ్డల్ని కూరలోనే కాకుండా సన్నగా తరిగి సలాడ్‌‌పై వేసుకొని తింటారు. ఇది ఒంట్లో విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. బ్యాక్టీరియా నిరోధకంగా పని చేస్తుంది. వేసవిలో శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని వెంటనే తగ్గించుకోవాలంటే ఉల్లిగడ్డ గుజ్జును పాదాలు, మెడపై రాసుకుంటే శరీరం మొత్తం చల్లబడుతుంది.

కీరదోసకాయ

కీరదోసకాయలో నీటి శాతంతో పాటు పోషక విలువలు ఎక్కువ. కీరదోసకాయ ముక్కలతో చేసే సలాడ్‌‌ అరుగుదలకు బాగా పని చేస్తుంది. ఒంట్లో విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అలాగే రక్తంలో షుగర్‌‌ స్థాయిలను క్రమబద్ధం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని తగ్గించడంలో కీరదోస బాగా పని చేస్తుంది. వేసవిలో ఎదురయ్యే చర్మవ్యాధులను తగ్గించడంతో పాటు  మెదడును ఉత్సాహపరుస్తుంది.

 

తాటి ముంజలు

దాహార్తిని తగ్గించడంలో, శరీరాన్ని చల్లబరచడంలో తాటి ముంజలు బాగా పని చేస్తాయి. నీరసం, అలసటను తగ్గించి.. శరీరానికి కావాల్సిన తక్షణ శక్షిని అందిస్తాయి. చిన్నారులు, వృద్ధులతో పాటు గర్భిణులు కూడా వేసవిలో తాటి ముంజలు తినడం మంచిది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరిచి, మలబద్ధకం, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.  వేసవిలో ఎదురయ్యే అన్ని రకాల జీర్ణ సమస్యలను తాటి ముంజలు దూరం చేస్తాయి.