మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో నిర్మల్ జిల్లాలోని రాత్రి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్లు పంట నేలకొరిగింది.. మరికొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిముద్దయింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు చేతులతో ఎత్తుతున్న దృశ్యాలు కలచివేశాయి. ఆరుగాలం పంటను కోతులు, పందులు, యూరియా కష్టాలతో కంటికి రెప్పలా కాపాడుకొని అమ్ముకునేందుకు మార్కెట్ కు తెస్తే వర్షం కారణంగా సరైన వసతులు లేక పంట నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన చెందారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
