
హైదరాబాద్ : కాంగ్రెస్ వార్ రూం కేసులో సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన 41 ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని కోరతూ సునీల్ కనుగోలు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు..తీర్పును జనవరి 2, 2023కు వాయిదా వేసింది.
సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ వార్ రూమ్ తో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు తరపు న్యాయవాది వాదించారు. ఈ కారణంగా ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలని కోరారు. వీడియో స్పూఫ్ లకు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు ఏ1 గా ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు వివరించారు. అయితే ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం నాడు తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.
హైదరాబాద్ మాదాపూర్ లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై సీసీఎస్ పోలీసులు సోదాలు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు మహిళలపై అనుచితంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసినట్టుగా సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే ఈ పోస్టులు ఎక్కడి నుండి పెడుతున్నారనే విషయమై దర్యాప్తు నిర్వహించగా మాదాపూర్ లో కార్యాలయం ఉందని గుర్తించినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ విషయమై అందిన ఫిర్యాదుల మేరకు ఐదు కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.