- జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశం
- రిపోర్ట్ సమర్పించిన అతుల్ నారాయణ్ కమిటీ
హైదరాబాద్, వెలుగు : సిటీ నడిబొడ్డున ఉన్న దుర్గం చెరువు రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. దుర్గం చెరువులో కాలుష్యం కారణంగా వందలాది చేపలు చనిపోతున్నాయని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నది. ఇందులో భాగంగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. చెరువు పరిరక్షణకు గతంలో నియమించిన అతుల్ నారాయణ్ కమిటీ తన రిపోర్టును సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేసింది.
కమిటీ రిపోర్ట్ పై కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆఫీసర్లకు బెంచ్ స్పష్టం చేసింది. చెరువులోకి మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్, చెత్త చేరకుండా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు చెరువు చుట్టూ చెట్లు, గార్డెన్లను డెవలప్ చేయాలని, సైన్ బోర్డులు ఏర్పాటుతో పాటు మొత్తంగా ఆహ్లాదకరంగా ఉండేలా చేయాలని సూచించింది. చెరువు రక్షణకు అవసరమైన స్వల్ప, దీర్ఘకాలిక రిపోర్టులు తయారు చేసి ఈనెల 28న జరిగే విచారణ నాటికి అందజేయాలని ఆదేశించింది. చెరువు రక్షణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే అధికారులను కోర్టుకు పిలిపించి విచారిస్తామని హెచ్చరించింది.
కమిటీ రిపోర్టులో ఇలా..
దుర్గం చెరువు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గరిష్ట లోతు 10 నుంచి 13 మీటర్లు. 2020లో దీనిపై కేబుల్ వంతెన ప్రారంభించారు. సరస్సును ఆనుకుని ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని రక్షిత ప్రాంతంగా మార్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఆధ్వర్యంలో రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. వీటితో తక్కువ మురుగునీరు శుద్ధి అవుతోంది. చెరువు దగ్గరలోని నీటి కాలువలో హానికర ఈ కోలీ బ్యాక్టీరియా కనిపించింది. చెరువు నీటిలో ఐరన్, మాంగనీస్, నికెల్, జింక్ వంటి భారీ లోహాలు.. అలాగే ఆర్సెనిక్, బోరాన్ వంటివి ఉన్నాయి.
ఇవి నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన స్థాయిలో లేవు. మురుగు నీటిని దిగువకు మళ్లించడానికి చెరువు అంచున పైపులు వేసే పనిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ చేపట్టినా ఇంకా పూర్తికాలేదు. చెరువు 160.6 ఎకరాల విస్తీర్ణంలో ఎఫ్టీఎల్ సరిహద్దును ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినా తుది నోటిఫికేషన్ వెలువడలేదు.
ఎఫ్టీఎల్ సరిహద్దు మ్యాప్ ప్రకారం 78 నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో, 146 నిర్మాణాలు బఫర్ జోన్లో ఉన్నాయి. చెరువును పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేయడం ప్రారంభించింది. చెరువు చుట్టూ కంచె వేసింది. అయితే పలువురి అభ్యంతరం, పెండింగ్ వ్యాజ్యాల కారణంగా కంచె నిర్మాణం 300 మీటర్లు ఆగింది. సరిహద్దు వెంట వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
చెరువు సంరక్షణకు స్వల్పకాలిక చర్యలు
చుట్టుపక్కల నుంచి కాలుష్యం చెరువులోని చేరకుండా నియంత్రించాలి. సరస్సులోకి వచ్చే శుద్ధి చేసిన నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిక్షించాలి. వర్షాకాలం ముగిసిన తర్వాత నీటి నాణ్యత పరిక్షించి.. శుభ్రపరిచే పనిని జీహెచ్ఎంసీ చేపట్టాలి. దీని కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపీ) పాటించాలి. మురుగు నీరు చేరకుండా చూడాలి. చెత్త రాకుండా చర్యలు తీసుకోవాలి.
ఒకవేళ వస్తే తొలగించాలి. సందర్శకులు కూడా చెత్త వేయకుండా చూడాలి. చేపలు పట్టేందుకు సరైన పద్ధతిని పాటించాలి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. గణేశ్ నిమజ్జనంతో చెరువుల్లోని నీరు సరస్సులోకి రాకుండా చూసుకోవాలి.చుట్టూ చెరువు వివరాలతో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. నేల కోతకు గురికాకుండా చెట్లను పెంచాలి.
దీర్ఘకాలిక చర్యలు..
చెరువును రెవెన్యూ శాఖతో పాటు నీటిపారుదల, ప్రజా పనుల శాఖ సర్వే చేయాలి. సర్వేలో చెరువులోకి చేరుతున్న నీటి వివరాలు, వాస్తవ సరిహద్దులు, సర్వే నంబర్లు, నీరు నిండే ప్రాంతం, నీరు బయటికి వెళ్లే మార్గాలను గుర్తించి బఫర్ జోన్గా పేర్కొనాలి. ఆక్రమణలకు గురికాకుండా సర్వే మ్యాప్లో సరస్సుకు 30 మీటర్ల దూరం, కాలువలకు 15 మీటర్ల దూరం గుర్తించాలి. మ్యాప్ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. నీటి నాణ్యతను ఏడాది పాటు పర్యవేక్షించాలి. కాలుష్యం పరిమాణాన్ని లెక్కించి రక్షణ చర్యలు చేపట్టాలి. కాలుష్య మురుగు నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ చెరువులోకి చేరనీయవద్దు.
మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల పనితీరును కూడా నిరంతరం పర్యవేక్షించాలి. బయటి వనరుల నుంచి చెరువులో చేరుతున్న వ్యర్థాలను తప్పనిసరిగా నిలిపివేయాలి. చుట్టూ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలి. సరస్సు చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి స్థానిక సంస్థలు, ప్రజా సంఘాలతో రెగ్యులర్గా క్లీన్–అప్ ఈవెంట్లను నిర్వహించాలి. చెరువులో చెత్తను పూర్తిగా తొలగించి లోతు నిర్ధారించాలి. నీటి నిల్వ పెరిగి, భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పార్కులను అభివద్ధి చేయాలి. ఇలా అతుల్ నారాయణ్ కమిటీ తన రిపోర్టు ద్వారా పలు కీలక సూచనలు చేసింది.